హుజూరాబాద్ టౌన్, జూలై 20: బీజేపీ నేత ఈటలకు ఓటమి భయం పట్టుకుందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ ఆక్షేపించారు. ఆయన్ను చంపాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి గానీ లేదని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లు పాలించాలని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే కావాలనే కేసీఆర్ను దూరం చేసుకొని పార్టీని వీడి ఎన్నికలు కొని తెచ్చారని దుయ్యబట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే పాదయాత్ర దేని కోసం చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. 18ఏళ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఆయన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకునేందుకు పాదయాత్ర ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈటల తప్పుడు పనుల వల్లే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ అయ్యాడని, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలువననే ఉద్దేశ్యంతోనే బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నాడని ఆరోపించారు. ఆయన గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తాడో చెప్పి పాదయాత్ర చేయాలని, గ్యాస్, డిజీల్, పెట్రోల్ ధరలు పెంచినందుకా ఈ పాదయాత్ర చేస్తుంది అని ఎద్దేవా చేశారు. ఈటలకు హాని చేయాలనే ఆలోచన ఎవరికీ లేదని, అంత అవసరం పార్టీకి గానీ, మంత్రులకు గానీ లేదని స్పష్టం చేశారు. నీచమైన కుట్రలు, కుతంత్రాలు చేసేది బీజేపీ నాయకులు మాత్రమేనని మండిపడ్డారు. ఆయన ఓటమిని కండ్లారా చూసేందుకైనా ఈటల నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నానన్నారు.
ఇంకెన్నాళ్లీ నాటకాలు: టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్
గ్యాంగ్స్టర్ నయీం లాంటి వ్యక్తే ఏం చేయలేకపోయాడని అంటున్న ఈటలను మరి ఇంకెవరు ఏం చేస్తారని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజల కోసం ఏ రోజు పాదయాత్ర చేయని వ్యక్తి, తనను గెలిపించాలని పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బండి సంజయ్, రఘునందన్రావు డ్రామాలు చేసి గెలిచారని, ఈటల కూడా అలాగే గెలవాలని నాటకాలు చేయడం నీచంగా ఉందని.. ఇంకెన్నాళ్లీ డ్రామాలు అని మండిపడ్డారు. ఈటలకు ఓటమి భయం పట్టుకొనే అలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు భయపడి గెలువలేనని భావించే టీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా ఉన్నాయని పొగుడుతుంటే రాష్ట్ర నాయకులు, ఈటల కండ్లకు కనిపించకపోవడం బాధాకరమన్నారు. దళితుల జీవితాలు మార్చాలని, దళితులను గొప్పవారిని చేయాలన్న సంకల్పంతోనే దళిత బంధు పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం పట్ల దళితులందరి పక్షాన సీఎం కేసీఆర్కు, మంత్రి మండలికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడ హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బర్మవత్ రమ్మ, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, టీఆర్ఎస్ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండీ రీయాజ్, యువజన అధ్యక్షుడు గందె సాయిచరణ్, సోషల్ మీడియా కన్వీనర్ గాలి రాకేష్, కౌన్సిలర్లు యాదగిరినాయక్, బొరగాల శికుమార్, నాయకులు పంజాల కుమారస్వామి, మొలుగు ప్రభాకర్, బొరగాల రాజయ్య, బత్తుల సమ్మయ్య, ఎస్కే ఫయాజ్, భూసారపు బాబురావు, వెంకటేశ్వర్లు, మల్లయ్య, శివలు ఉన్నారు.