జమ్మికుంట, జూలై 20: మండలంలోని బిజిగిరిషరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైంది. బక్రీద్ను పురస్కరించుకొని దర్గా కమిటీ ఆధ్వర్యంలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లా అలై ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఉత్సవాలు నిర్వహించేందుకు దర్గా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు హాజరుకానున్నారు. సమాధులపై చాదర్ సమర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు.
సర్వమతాలకు ప్రతీక దర్గా
బిజిగిరిషరీఫ్ దర్గా సర్వమతాలకు ప్రతీకగా నిలుస్తున్నది. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించారు. సుమారు 861 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన దర్గాలో హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లా అలై, ఆయన సోదరుడు హజ్రత్ సయ్యద్ అజ్మత్షావళి, వారి కొడుకులు హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావళి, హజ్రత్ సయ్యద్ అక్బర్షావళి సమాధులు ఉన్నాయి. అరబ్బు దేశం నుంచి హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి ఇస్లాంతో పాటు అల్లా సందేశాన్ని ఖురాన్లోని సూక్తులను ప్రజలకు వివరిస్తూ మధ్య యుగం కాలంలో దేశాలన్నీ తిరిగారు. మానవత్వం.. సమానత్వమే మతమని చాటుతూ ప్రచారం చేశారు. అలా బిజిగిరిఫరీఫ్ చేరుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి దర్గాను నిర్మించారు. హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి తన జీవిత కాలంలో ప్రదర్శించిన మహిమలు, ప్రజలపై చూపిన కరుణ, సుఖశాంతులతో జీవితం గడిపారు. హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జిల్ హజ్ మాసంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నిష్టతో ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు కోరిన కోరికలు హజ్రత్ ఇంకుషావళి తీరుస్తాడని ప్రసిద్ధి.
నేటి నుంచి ఉత్సవాలు…
ఉర్సు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం (బక్రీద్ రోజున) గుసుల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గా ముతావళి మహ్మద్ అక్బర్ అలీ దర్గా కమిటీ అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో దర్గా ముజావర్లు హైదరాబాద్ నుంచి తెచ్చిన చాదర్లు, మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులు కూడా చాదర్లను సమర్పిస్తారు. రాత్రి ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం సందల్ షరీఫ్ (గంధ లేపనం) ఉంటుంది. దీన్ని మొగుళ్లపల్లి నుంచి తెస్తారు. గంధ లేపనాన్ని భక్తులు భారీ ఊరేగింపుతో తీసుకువస్త్తారు. భక్తిశ్రద్ధలతో సమాధులను అలంకరిస్తారు. అనంతరం మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను ఆలపిస్తూ కవ్వాలీ నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్ఘడ్ తదితర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల కోసం విద్యుత్ దీపాలు, తాగునీరు, వైద్యం, తదితర ఏర్పాట్లు చేసినట్లు దర్గా కమిటీ అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ తెలిపారు.