రాంనగర్, జూలై 20: కరీంనగర్ కమిషనరేట్లోని పలు ప్రాంతాల్లో 12 బైకులు చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ డీసీపీ అశోక్ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్ అలియాస్ జల్సా ఆటోడ్రైవర్గా పని చేసేవాడు. 2010లో మోతెకు చెందిన అమ్మాయిని కర్నూల్లో వివాహం చేసుకుని 2012 వరకు అక్కడే ఉన్నాడు. అనంతరం గుండి ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్, కారుతో పాటు పలు వాహనాలను నడిపాడు. 2020 జనవరిలో గోపాల్రావుపేటలో ఆటో స్టోర్ పెట్టుకున్నాడు.
లాక్డౌన్ కారణంగా నష్టం రావడంతో షాప్ తీసేసి కూలీ పనికి వెళ్లాడు. 2021 మార్చి నుంచి కరీంనగర్ మంకమ్మతోటలో భార్య, కొడుకు, కూతురుతో కిరాయికి ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు పెరుగడంతో బైకులు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. బైకు తాళాలు ఏ విధంగా తీయాలో ఇంటర్నెట్ సహాయంతో నేర్చుకున్నాడు. కరీంనగర్ టూటౌన్ పరిధిలో 9 బైకులు, కొడిమ్యాల, రామడుగు, పెగడపల్లి, నామాపూర్లో మూడు బైకులు దొంగిలించాడు. నంబర్ ప్లేట్లు తీసేసి అతడి స్నేహితుల వద్ద ఉంచాడు. కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా శ్రీనివాస్ను పద్మనగర్ బైపాస్ రోడ్డులో పట్టుకుని అరెస్టు చేశారు. అతడితోపాటు స్నేహితుల వద్ద ఉన్న 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న టూ టౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ మహేశ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీలు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్రెడ్డి, పవన్ను సీపీ కమలాసన్ రెడ్డి అభినందించి రివార్డులు ప్రకటించారు.