ఇల్లందకుంట, జూలై 20: ఈటల మొసలి కన్నీరుతో ప్రజలను మోసం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. మంగళవారం సిరిసేడు, రాచపల్లి, మల్లన్నపల్లి, మర్రివానిపల్లి, ఇల్లందకుంట గ్రామాల్లో బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సమావేశంలో సీఎం కేసీఆర్ ఈటలను ఎడమ, కుడి భుజంగా కూర్చొబెట్టుకుంటే.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. తనను చంపుతారని ఈటల చెప్పుకోవడం సిగ్గు చేటని, అలాంటి మాటలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. రైతు బంధు తరహాలో దళితుల కోసం దళిత బంధు ప్రవేశపెట్టామని, ఇందులో ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు లాక్కున్న ఈటలకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఈటల చేసింది శూన్యం: ఎమ్మెల్యే సుంకె
ఈటల రాజేందర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ఆయన ఇచ్చే డబ్బులు, కుట్టు మిషన్లు, గడియారాలు, కుంకుమ భరణిలకు ప్రజలు లొంగరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ఏవైనా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, రెండు సార్లు మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి కింద నెలనెలా డబ్బులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. అనంతరం మర్రివానిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బెల్లి స్వప్న రవీందర్, వార్డు సభ్యుడు కోడెం సంజీవ్ టీఆర్ఎస్లో చేరగా, పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి స్వాగతం పలికారు. ఇక్కడ జనగాం గ్రంథాలయ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ, సర్పంచ్లు లలిత, మానస, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, చిన్న రాయుడు, ఎడ్ల ఓదెలు, టీఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి, తిరుపతిరెడ్డి, వాసు, సదానందం, మహేందర్ పాల్గొన్నారు.