కరీంనగర్, జూలై 10(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతితోపాటు హరితహారం కార్యక్రమాలు ప్రజల్లో స్ఫూర్తి నింపాయి. అధికారులు రూపొందించిన షెడ్యూలు ప్రకారం అన్ని గ్రామాల్లో పది రోజుల పాటు పండుగలా జరిగాయి. ఈ నెల 1న ప్రారంభమైన కార్యక్రమాల్లో అనేక చోట్ల స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
సమస్యలు గుర్తించి.. పరిష్కరించి
మొదటి రోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ర్యాలీలు తీశారు. పట్టణాల్లోనూ డివిజన్లు, వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించి సమస్యలను గుర్తించారు. వీటిని సమస్యలను పది రోజుల పాటు పరిష్కరించే ప్రయత్నం చేశారు. మురుగు కాలువలు, పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ ప్రదేశాలు, అంతర్గత రోడ్లను శుభ్రపర్చారు. అక్కడక్కడా ఉన్న పనికిరాని బోర్లు, పడావుపడిన బావులను పూడ్చి వేశారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై లేకుండా చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రభుత్వ సంస్థల భవనాల పరిసరాలను శుభ్రం చేశారు. దాదాపుగా పూర్తయిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను ప్రారంభించుకున్నారు. మురుగు నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేశారు. మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయించారు. పైప్లైన్ లీకేజీలను అరికట్టారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. గతంలో నాటి, చనిపోయిన చోట, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అవెన్యూ ప్లాంటేషన్ 100 శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో అనేక గ్రామాల్లో మొక్కలు నాటారు. పలు గ్రామాల్లో గుర్తించిన లే అవుట్ స్థలాల్లోనూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ఐదో రోజు నిర్వహించిన పవర్ డేను స్థానికులు సద్వినియోగం చేసుకున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్తు అధికారులు, సిబ్బంది సహకారంతో లూజ్ వైర్లను సరిచేసుకున్నారు. విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి వేసుకున్నారు. ఇలా అనేక అభివృద్ధి పనులకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు వేదికలుగా నిలిచాయి.
జిల్లాలో పది రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో జరిగిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్తోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, భానుప్రసాద్ రావు అనేక గ్రామాలు, పట్టణాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు, జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, డీపీఓ వీరబుచ్చయ్య, జడ్పీ సీఈవో సీ రమేశ్, తదితర అధికారులు గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ముఖ్యంగా మహిళా స్వశక్తి సంఘాలు, యువజన సంఘాలు ముందుకు వచ్చి గ్రామాల్లో శ్రమదానాలు చేసుకున్నాయి. రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేసుకున్నారు. యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చిన గిరక తాళ్లను ఈసారి పెద్ద సంఖ్యలో పంపిణీ చేయగా, గీత పారిశ్రామిక సహకార సంఘాలు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాయి. ఇలా అనేక అంశాల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి.