వీణవంక, జూలై 9: తెలంగాణ రాష్ట్రంలోని గీతకార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తున్నదని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన గిరకతాళ్ల మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ, పోతిరెడ్డిపల్లి గ్రామంలోని గీత కార్మికులకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం 2002 గిరకతాళ్ల మొక్కలు పంపిణీ చేయగా, వాటిలో 150 మొక్కలు నాటినట్లు తెలిపారు. గౌడ సోదరులు మొక్కలను సంరక్షిస్తూ జీవనోపాధిని మెరుగు పరచుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే పల్లెప్రగతి ఉద్దేశమని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని గీతకార్మికులు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, నిండు మనసుతో ఆశీర్వదించి రానున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం గీతకార్మికులు తమ సమస్యలను తెలియజేయగా, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పల్లెప్రగతి ప్రత్యేకాధికారి, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ పంజాల అనూష, ఎంపీటీసీ రాధారపు రాంచందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్రెడ్డి, పంజాల సతీశ్, గీతకార్మిక సంఘం గ్రామాధ్యక్షుడు దూలం శ్రీనివాస్, ఎక్సైజ్శాఖ ఎస్ఐ రమాదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.