పోయినేడు తరహాలోనే కొనుగోళ్లు గ్రామాల్లోనే కాంటాలు
స్పష్టతనిచ్చిన సీఎం కేసీఆర్
రైతుల్లో తొలగిన ఉత్కంఠ
ఉమ్మడి జిల్లాలో 9.16 లక్షల ఎకరాల్లో వరి సాగు
గతంతో పోల్చితే 30శాతం పెరిగిన విస్తీర్ణం
ఈ సారి 21.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగనున్న దిగుబడి
1,268 కేంద్రాలకు ప్రతిపాదనలురైతుల్లో హర్షాతిరేకాలు
కరీంనగర్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ప్రకటనతో రైతుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. కాళేశ్వరం జలాలతో ఉమ్మడి జిల్లాలో వరి సాగు పెరిగి ఏటేటా దిగుబడులు భారీగా వస్తుండగా, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలని కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం జలాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పంట దిగుబడులు భారీగా పెరుగడం, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రతి గ్రామానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. అయితే కేంద్ర చట్టాల మేరకు మార్కెట్ యార్డుల్లోనే కొనుగోళ్లు జరుపుతామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. బుధవారం అసెంబ్లీలో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం చెబుతూ, కేంద్ర చట్టాలు ఏ విధంగా ఉన్నా రాష్ట్రంలో మాత్రం ఎప్పటిలాగే కొనుగోళ్లు జరిపి తీరుతామని, ఎమ్మెస్పీ చెల్లిస్తామని స్పష్టం చేయడంతో హర్షం వ్యక్తమవుతున్నది.
21.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వా త రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలోనే అధికంగా వరి సాగవుతున్నది. పైగా ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగు తున్నది. ఈ యాసంగిలోనూ గత సీజన్ కంటే 30 శాతం పెరిగినట్లు తెలుస్తున్నది. ఈ సారి 21.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కరీంనగర్ జిల్లాలో 2.55 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 5.93 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి, 364 కేంద్రాలకు ప్రతిపాదనలు చేశారు. ఇక పెద్దపల్లిలో 1.97 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ 291 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాలలో 2.97 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 7.73 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక్కడ 387 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సిరిసిల్ల జిల్లాలో 1.67 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 3.00 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ 226 కేంద్రాలకు ప్రతిపాదనలు చేశారు.
6.99 లక్షల మెట్రిక్ టన్నులు అదనం..
గత యాసంగిన్లో చూస్తే కరీంనగర్ జిల్లాలో 3.60 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో 3.68 లక్షలు, జగిత్యాల జిల్లాలో 4.44 లక్షలు, సిరిసిల్ల జిల్లాలో 2.45 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున 14.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను కొనుగోలు చేశారు. ఈ సారి సుమారు 6.99 లక్షల మెట్రిక్ ధాన్యం అదనంగా రాబోతున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లలో ధాన్యం విక్రయించుకోవడం సాధ్యమయ్యే పని కాదని ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది. సార్ నిర్ణయం తీసుకోకుంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేదని రైతులు అంటున్నారు.
వచ్చే నెల నుంచే కోతలు
వచ్చే నెల నుంచి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలున్నందున అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్, మే నెలల్లో కనీసం 40 రోజుల పాటు కొనుగోళ్లు జరిగే అవకాశాలుంటాయి. ఇందులో 20 రోజులు మాత్రం విపరీతంగా ధాన్యం వచ్చే అవకాశాలుంటాయి. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తక్షణమే అమలు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ముందుగానే సిద్ధమవుతున్నారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ప్రతి గ్రామానికో ఓ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశమన్నది.