సీపీ కమలాసన్రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
మిగతా జిల్లాల్లో కట్టడికి సలహాలివ్వాలని సూచన
కలెక్టర్లు, పోలీస్, వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
కరోనా చికిత్స, లాక్డౌన్, ధాన్యం కొనుగోళ్లు, తదితర అంశాలపై చర్చ
మెడికల్, ప్రభుత్వ సిబ్బందికి ప్రశంసలు
జిల్లాల్లో పరిస్థితిని వివరించిన కలెక్టర్లు
కరీంనగర్, మే 21 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ అమలు తీరు బాగున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు. పకడ్బందీగా అమలు చేస్తున్న పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కరీంనగర్ మాదిరిగా అమలు చేసేందుకు తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, వైద్యశాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. లాక్డౌన్ ఈ నెల 30 వరకు ఉంటుందని, మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. కరోనా రెండో దశ నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని దవాఖానల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. పేపర్ బాయ్స్, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, డెలివరీ బాయ్స్, విద్యుత్, గ్యాస్ సరఫరా బాయ్స్, కండక్టర్లు నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న వారిని గుర్తించి వారికి మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్ అందించాలని, ఇందుకోసం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. జిల్లాల్లో సూపర్ స్ప్రెడర్లను గుర్తించి జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనాపై నిర్విరామంగా పోరాడుతున్న మెడికల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెలాఖరు వరకు పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా పూర్తిస్థాయిలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పరిస్థితిని వివరించిన కలెక్టర్లు
ఉమ్మడి జిల్లాలో కరోనా నియంత్రణ, లాక్డౌన్ అమలు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు వివరించారు. లాక్డౌన్ తర్వాత జిల్లాలో పాజిటివ్ రేటు తగ్గిందని, అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా నడుస్తున్నాయని, పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 2,80,172 గృహాల్లో ఇంటింటా జ్వర సర్వే పూర్తయిందని, 6,402 మందికి కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించి హోం ఐసొలేషన్ ఉంచి మెడికల్ కిట్లు అందజేశామని కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లాలో 65 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. జగిత్యాల జిల్లాలో కరోనా చికిత్స కోసం మొత్తం 535 పడకల్లో 217 పడకలు వినియోగంలో ఉన్నాయని కలెక్టర్ జీ రవి తెలిపారు. జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం నాలుగు వేల యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయని, ఇంటింటా జ్వర సర్వే ద్వారా ఇప్పటి వరకు 3789 మందికి లక్షణాలున్నట్లు గుర్తించామని తెలిపారు. జిల్లాలో 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. కరీంనగర్లో సీపీ కమలాసన్రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్, డీఎంహెచ్వో జువేరియా.. జగిత్యాలలో ఎస్పీ సింధూశర్మ, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ జల్ద అరుణశ్రీ, డీఎంహెచ్వో శ్రీధర్.. సిరిసిల్లలో డీఎస్పీ రవికుమార్, డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు, సూపరింటెండెంట్ మురళీధర్రావు, వైద్యులు మీనాక్షి, హరికృష్ణ.. పెద్దపల్లిలో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణ, సీపీ సత్యనారాయణ, డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.