దళితబంధు అమలును ఆపేందుకు చేసిన కుట్రలపై హుజూరాబాద్ భగ్గుమన్నది. ఈటల వెన్నుపోటుపై ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. నోటికాడి బుక్కను మట్టిపాలు చేస్తారా అంటూ దళితలోకం కన్నెర్రజేసింది. మంగళవారం పల్లె పట్నం తేడా లేకుండా నిరసన తెలిపింది. శవయాత్రలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో నియోజకవర్గం హోరెత్తగా, అడుగడుగునా ‘దళిత వ్యతిరేకి ఈటల డౌన్ డౌన్’ అంటూ నినదించింది. రాజేందర్ సహా బీజేపీ నేతలు రాసిన లేఖలతోనే దళితబంధు ఆగిపోయిందని, తినే కంచంలో మన్ను పోశారని మండిపడ్డది. రాజేందర్ మొసలి కన్నీళ్లు.. డ్రామాలు ఆపాలని, ఓట్ల కోసం దళితవాడలకు రావద్దని హెచ్చరించింది. ఈ ఎన్నికలో బీజేపీని బొంద పెట్టి తీరుతామని స్పష్టం చేసింది. దళిత జాతి ఉద్ధరణ కోసం పథకాన్ని అమలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు వెంటే ఉంటామంటూ ముక్తకంఠంతో చెప్పింది.
హుజూరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల కుట్రలపై హుజూరాబాద్ నియోజకవర్గ దళితబిడ్డలు భగ్గుమన్నారు. రాజేందర్ సహా ఇతర బీజేపీ నేతలు దళితబంధును నిలిపివేయాలని లేఖలు రాసి తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టారంటూ దుమ్మెత్తిపోశారు. దళితబంధు నిలిపివేయాలని సోమవారం సాయంత్రం ఈసీ ఆదేశాలు జారీ చేయగా, మరుక్షణం నుంచే ఆందోళనకు దిగారు. మంగళవారం నియోజవకవర్గవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. శవయాత్రలు తీసి దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాస్తారోకోలు చేసి, వ్యతిరేకంగా నినదాలు చేశారు. దళితబంధు మళ్లీ కొనసాగించేలా ఈసీకి మళ్లీ బీజేపీ నాయకులు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. దళితుల నోట్లో మట్టి కొట్టిన ఈటల, బండి, బీజేపీ నాయకులను కాలనీల్లోకి రాకుండా తరిమికొడతామని హెచ్చరించారు. దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెడితే, మొదటి నుంచి బీజేపీ నాయకులు కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్, కనుకులగిద్ద, కందుగుల గ్రామాల్లో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మతో శవయాత్ర తీశారు. అనంతరం దహనం చేశారు. వీణవంక మండల కేంద్రంతో పాటు వల్బాపూర్, రెడ్డిపల్లి, చల్లూరు గ్రామాల్లో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీణవంక గ్రామ శివారు నుంచి చౌరస్తా వరకు దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి, కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై 500 మందికిపైగా దళితులు బైఠాయించి ధర్నాకు దిగారు. జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీతో పాటు 2వ వార్డు పరిధిలోని ధర్మారంలో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట మండలంలోని నాగంపేట, జగ్గయ్యపల్లి, వావిలాల, మడిపల్లి, కోరపల్లి, శాయంపేట, మాచినపల్లిలో దిష్టిబొమ్మ దహనం చేశారు. మాచనపల్లి శవయాత్ర తీసి, కాట్నం పేర్చి మరీ దిష్టిబొమ్మకు అగ్గిపెట్టారు. ఇల్లందకుంటలో కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఆధ్వర్యంలో దళితులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై బైఠాయించి గంటపాటు ధర్నా చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కన్నూర్లో రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయాచోట్ల ఈటల తీరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బాగుపడడం ఇష్టం లేకే బీజేపీ నాయకులు ఈ పథకాన్ని కుట్రపూరితంగా నిలిపివేయించారని మండిపడ్డారు. బీజేపీ దళిత వ్యతిరేకిగా మారిందని, అలాంటి పార్టీని నమ్మేదిలేదని స్పష్టం చేశారు. తినే కంచంలో మన్ను పోశాడని ఈటలకు దళిత మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఈటల దళితవాడలకు వస్తే తరిమికొడుతామని, ఈ ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని ముక్తకంఠంతో హెచ్చరించారు. దళిత బంధు కొనసాగించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈటల లేఖ రాయాలని డిమాండ్ చేశారు.