హుజూరాబాద్, అక్టోబర్ 19: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆత్మగౌరవమంటూ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు.. సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మభ్య పెడుతున్నాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మండిపడ్డారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజేందర్ ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, చివరికి బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఏది చెబితే అది ప్రజలు వింటారనే భ్రమలో ఈటల ఉంటే తప్పే అవుతుందని, ప్రజలకు అన్నీ తెలుసునని స్పష్టం చేశారు. ఇన్నేండ్లలో ఆయన చేసిందేమీ లేదని, ఉప ఎన్నికలో రాజేందర్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, టీజీఏ సైన్యం గెల్లుకు మద్దతుగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. శ్రీనివాస్ గెలుపులో పాలుపంచుకోవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని, పనిచేసే ప్రభుత్వానికి అవకాశం ఇస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
ఈటలకు బుద్ధి చెప్పాలి
బీజేపీ నేత ఈటల నమ్మక ద్రోహి అని, ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో అన్ని రకాల పదవులు అనుభవించి ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన రాజేందర్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. సొంత లాభం కోసం అమాయక ప్రజలను ఈటల మోసం చేస్తున్నాడని, విద్యావంతులు ఆయన ద్రోహాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. గెల్లు శ్రీను గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికపై నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉందని, మంచి.. చెడు ఏదో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి గ్యాడ్యుయేట్స్కు పిలుపునిచ్చారు. రాజేందర్ అసమర్థత వల్లే హుజూరాబాద్ జిల్లా కాలేదని, అతని యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఎండగట్టాలన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలుపులో పాలుపంచుకోవాలని కోరారు. ఇక్కడ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్రెడ్డి, టీజీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, అసోసియేషన్ నాయకులు రజనీకాంత్, మల్లేశం ఉన్నారు.