దళితుల బాగుకోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం పెడితే బీజేపీ నాయకుడు ప్రేమేందర్రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపేయించిండు. బీజేపోళ్లు అడ్డుపడినా ఈ పథకం ఆగదు. మా అంటే ఉప ఎన్నిక అయ్యే వరకు పది, పన్నెండు రోజులు ఆగుతది కావచ్చు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పథకం యూనిట్లను దగ్గరుండి గ్రౌండింగ్ చేయించే బాధ్యత నేను తీసుకుం. దళితబందు పథకం రాలేదని ఏ ఒక్క దళిత బిడ్డ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పథకం వర్తించని అర్హులు దరఖాస్తు చేసుకుంటే వారికి వర్తింపజేయించే బాధ్యత నాదే. ఏడేండ్లు పదవిలో ఉన్నా ఈటల రాజేందర్ ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలె.. అలాంటి వ్యక్తికి మళ్లీ ఓటెందుకు వేయాలి. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న టీఆర్ఎస్ సర్కారును ఆదరించండి. అభ్యర్థి గెల్లు సీనును గెలిపించండి.
కమలాపూర్/కమలాపూర్ రూరల్, అక్టోబర్ 19 : దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకువస్తే బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని, వారు అడ్డుపడినా ఆగదు అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మా అంటే పది, పన్నెండు రోజులు మాత్రమే ఆపగలరని, ఆ తర్వాత ప్రతి యూనిట్ను గ్రౌండింగ్ చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. మంగళవారం ఉదయం కమలాపూర్ మండలం పంగిడిపల్లి, వంగపల్లి, మర్రిపెల్లిగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. సాయంత్రం కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో జరిగిన ప్రచార సభ, మర్రిపల్లిగూడెంలో జరిగిన ధూంధాంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు.
పేదలకు పంచే టీఆర్ఎస్సా..? పెద్దలకు దోచే బీజేపా?
రాష్ట్రంలో పెరిగిన సంపదను పేదలకు పంచే టీఆర్ఎస్ కావాలా?, దేశంలో పేదలను దోచి పెద్దలకు పెట్టే బీజేపీ కావాలా? ప్రజలే ఆలోచన చేయాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచితే.. మోదీ కార్పొరేట్ పెద్దలకు రూ.10 లక్షల కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణను మోసం చేసిన బీజేపీకి ఓటెందుకు వేయాలో యువత ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీలు ఇస్తే ఇక్కడి యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. వరంగల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి కేటీఆర్ మెగా టెక్స్టైల్ పార్కు తీసుకువచ్చారని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా విజృంభించినా సీఎం కేసీఆర్ రైతుబంధు ఆపలేదని గుర్తు చేశారు. పెంచి పెద్ద చేసిన కేసీఆర్ను ఈటల మోసం చేశారని, అలాంటి వ్యక్తి రేపు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి, బట్టకాల్చి మీదేసి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని రాజేందర్ చూస్తున్నాడని మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పదిహేను రోజులకోసారి హుజూరాబాద్, కమలాపూర్, మర్రిపెల్లిగూడెం వచ్చి సొంత జాగాల్లో ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కడుపు నింపదన్నడు.. దండిగ తీసుకున్నడు
సీఎం కేసీఆర్ రైతుల పెట్టుబడి కోసం ప్రారంభించిన రైతుబంధు వారి కడుపు నింపదని విమర్శించిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తాను మాత్రం రూ.10.50 లక్షలు తీసుకున్నాడని మంత్రి మండిపడ్డారు. ఒకప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను విమర్శించిన ఆయన, ఇప్పుడు వాటిపై నోరుమెదపడం లేదని, నల్ల చట్టాలు తెల్ల చట్టాలుగా మారాయా? రాజేందర్ అంటూ ప్రశ్నించారు. ప్రజల అవసరాను తెలుసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ వైపు నిలుస్తారో.. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డీ విరిచిన బీజేపీ వైపు నిలుస్తారో ప్రజలు అలోచించుకోవాలని కోరారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుపడుతుందని రికార్డు కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రతి ఎకరాకు సాగు నీరందించడంతో పాటు పెట్టుబడి సహాయంగా ఎకరాకు రూ. 10 వేలు, 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. గతంలో ఎండాకాలంవస్తే పూటిక తీయాల్సిన పరిస్థితి ఉండేదని, క్రేన్లు కిరాయికి తెచ్చి బావులపూటిక తీసేవారని, దాంతో. డబ్బులన్నీ అయిపోయేవని గుర్తు చేశారు. ఇప్పుడా పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.
ఈటలవి ఝూటా మాటలు
ఈటల రాజేందర్ ఝూటా మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం రూ.291 వసూలు చేస్తుందని ఆయన చెప్పిన మాటలకు చర్చకు పిలిస్తే రాలేదని ఎద్దేవా చేశారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్నేహితుడు మండలంలో ఓ వ్యక్తి మృతికి కారణమైతే టీఆర్ఎస్ నాయకులపై తోసే ప్రయత్నం చేశాడని, ఇలా తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులు నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పకుండానే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మ్రంతి ఇనుగాల పెద్దిరెడ్డి, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మండల ఇన్చార్జి పెరియాల రవీందర్రావు, స్వర్గం రవి, సర్పంచులు దేవేందర్రావు, ఇనుగాల కిరణ్మయి విజయ్, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కళ్యాణి, నాయకులు పాడి కౌశిక్రెడ్డి, నవీన్ కుమార్, సుందర్ రాజ్, సంపత్ రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, డైరెక్టర్ సత్యనారాయణరావు, అరుణ, తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
పది లక్షలు తీసుకున్నడు పరిగె అంటున్నడు..
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలను పరిగె ఏరుకున్నట్లు ఉన్నయంటున్నడు. ఆయన మాత్రం రూ.10.50 లక్షల రైతుబంధు తీసుకున్నడు. రైతుల కడుపు నింపదంటున్నడు. ఆయనేమో దండిగ తీసుకుంటున్నడు. అప్పుడు నల్ల చట్టాలన్నడు.. ఇప్పుడు నోరు విప్పుతలేడు. దళితబంధును ఆపేయించిండు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మానవత్వం లేదంటున్నవ్ రాజేంద్ర.. ఒక్కసారి ‘ఆసరా’ తీసుకున్న అవ్వను అడుగు.. కల్యాణలక్ష్మి అందుకున్న పేదింటి ఆడపిల్లను అడుగు.. రైతుబంధు తీసుకున్న రైతన్నను అడుగు.. కేసీఆర్కు మానవత్వం ఉందో? లేదో? తెలుస్తది.