ఒకేసారి తీసుకువచ్చి ఇబ్బంది పడొద్దు
మూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు
కొవిడ్ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం
‘నమస్తే’తో కరీంనగర్ కలెక్టర్ శశాంక
కరీంనగర్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాల్లో అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని కరీంనగర్ కలెక్టర్ శశాంక సూచించారు. ఈసారి రైతు రైస్మిల్లు వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి పాత్రను కొనుగోలు కేంద్రం వరకే పరిమితం చేస్తున్నామని తెలిపారు. ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లోనే డబ్బులు జమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ.. అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ‘నమస్తే’తో పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే : జిల్లాలో ధాన్యం దిగుబడులు పెరిగాయి. కొనుగోళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
కలెక్టర్ : గత యాసంగిలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగా.. ఈసారి స్థానిక అవసరాలు అన్నీ పోగా.. 4.31 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశాం. గత యాసంగిలో 338 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 351 ఏర్పాటు చేశాం. కేంద్రాల వద్ద కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్యాడీ క్లీనర్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తాగునీరు తదితర వసతులు కల్పించాం.
ధాన్యం తీసుకువచ్చే విషయంపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించారు?
మద్దతు ధర రావాలన్నా.. కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోళ్లు సజావుగా సాగాలంటే ఎఫ్సీఐ నిర్ణీత నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తేవాలి. ఈ విషయంపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించాం. అలాగే.. మండల వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల శాఖాధికారులు సమన్వయంతో ఏ రైతు ఎప్పుడు తేవాలో షెడ్యూల్ రూ పొందించి వివరాలు అన్నదాతలకు అందించాం. పంచాయతీల్లో వివరించాం. ప్రతి రైతు కచ్చితంగా పాటించాలని నా విజ్ఞప్తి. దీని వల్ల అనేక లాభాలుంటాయి. సాధ్యమైనంత తక్కువ కాలంలో కొనే ఆస్కారం ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం వస్తే.. అటు కరోనా పరంగా, ఇటు కేంద్రం నిర్వహణలో ఇబ్బందులుండవు.
అకాల వర్షాలు వస్తున్నాయి. కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
నిజమే.. ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద 30 నుంచి 40 వరకు ఉన్నాయి. ఇవేకాకుండా కొనుగోలు కేంద్రాలు.. వీలైనంత ఎక్కువ టార్పాలిన్లు సమకూర్చుకొని ధాన్యంపై కప్పడం కోసమే కాకుండా తూర్పార పట్టుకోవడానికి, ఎండబెట్టుకోవడానికి అద్దెకు ఇవ్వాలని సూచనలు ఇచ్చాం. రైతులకు భారం కాకుండా అద్దె చార్జీలు ఆయా కేంద్రాలే నిర్ణయించుకోవాలని సూచించాం. కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల వద్ద నిల్వ ఉండకుండా 24 గంటల్లోగా లిఫ్ట్ చేసేందుకు ట్రాన్స్పోర్టు సౌకర్యం కల్పించాం.
పరిస్థితి చూస్తే.. దవాఖానల పాలవుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. బెడ్స్, చికిత్స పరిస్థితి ఏమిటి?
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఉన్న 180 బెడ్ల సంఖ్యను 272కి పెంచాం. వీటితో పాటు కొవిడ్ చికిత్స అందించాలని జిల్లాలో 20 పడకల ప్రైవేట్ దవాఖానలకు ఆదేశాలు జారీచేశాం. ఇప్పటికే జిల్లాలో 18 ప్రైవేట్ దవాఖానలు కొవిడ్ చికిత్స అందిస్తున్నాయి. తాజాగా, 20 పడకల దవాఖానలకు అవకాశం ఇవ్వడంతో మరో 96 దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అన్నీ కలిపి సుమారు మూడువేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి రోగులు ఇక్కడికే వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి.. వీలైనంత ఎక్కువ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నాం.
ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఇంకా ఎలాంటి అధునాత సౌకర్యాలు కల్పిస్తారు. ఎన్ని రోజుల్లో సమకూర్చే అవకాశం ఉన్నది?
ప్రస్తుతం 144 పడకలకు లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నది. దీనిని 200 పడకలకు పెంచుతున్నాం. ఇదే సమయంలో ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ వచ్చింది. మూడు నాలుగు రోజుల్లో ఇది అందుబాటులోకి వస్తుంది తద్వారా.. లిక్విడ్ నింపుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మూడు, నాలుగు రోజుల్లో ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్ష యూనిట్ అందుబాటులోకి రానున్నది. కాబట్టి ధర్మాసుపత్రిలో ప్రభుత్వం కల్పించిన అధునాతన సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి. వైద్యులు, వైద్య బృందాలు 24 గంటల పాటు పనిచేస్తున్నాయి. రోగులు పూర్తిగా సహకరించాలి.
వ్యాక్సినేషన్ ఎలా కొనసాగుతున్నది?
వేగం పుంజుకున్నది. లక్ష్యం నెరవేరాలంటే రో జుకు 3,500 మందికి టీకా వేయాలి. కానీ.. రెండు రోజులుగా సుమారు 5వేల మందికి వేస్తు న్నాం. ఎక్కడా టీకా కొరత లేదు. డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ విషయంలో పంచాయతీ నుంచి మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులంతా సహకరిస్తున్నారు. ప్రజల్లోనూ టీకా వేసుకోవాలన్న అవగాహన పెరిగింది. ఎటువంటి అపోహలు వద్దు. ప్రతిఒక్కరూ నిశ్చింతగా టీకా వేసుకోవాలి. కొవిడ్ నివారణకు ఇదొక ప్రధాన అస్త్రం.
కొవిడ్ను అడ్డుపెట్టుకొని పలు ప్రైవేట్ దవాఖానలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
ఒకటి మాత్రం స్పష్టం. ఎవరికైనా ఒక హద్దు ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ప్రస్తుతం ఉన్న కరోనావేవ్ను దృష్టిలో పెట్టుకొని 20 పడకల దవాఖానల్లో సైతం కొవిడ్ చికిత్స చేసే అవకాశం కల్పించాం. అయితే.. కొన్ని దవాఖానలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయని, ఎక్కువ మందులు రాస్తున్నారని, సం బంధం లేని నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారన్న ఫిర్యాదులొస్తున్న మాట వాస్తవం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.. ఇంకోవైపు సేవలందించాల్సిన అవసరాలు.. మరోవైపు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు వీటన్నింటినీ బేరీజు వేసుకొని.. ప్రైవేట్ వైద్యులు, దవాఖానల అసోసియేషన్లతో మాట్లాడుతున్నాం, మీటింగ్లు పెట్టి సుహృద్భావ వాతావరణంలో ఫిర్యాదుల అంశాన్ని ప్రస్తావించి.. తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. అయినా.. గీత దాటితే వేటు తప్పదు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సేవాభావ దృక్పథంతో చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.
కరోనా నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సూచనలు?
మాస్కులు కచ్చితంగా ధరించాలి. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అనేకచోట్ల అవగాహన కల్పిస్తున్నాం. అయినా నిర్లక్ష్యం వస్తే ఉపేక్షించే ప్రశ్నేలేదు. కచ్చితంగా ఫైన్ వేస్తాం. ఇప్పటికే పోలీసులు పలుచోట్ల ఫైన్లు వేశారు. అలాగే, భౌతిక దూరం పాటించాలి. గాలిలోనూ కొవిడ్ వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని.. అందరూ మసలుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించి, సమాజ రక్షణకు అండగా నిలువాలి.