కార్పొరేషన్, మార్చి 16: నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని నగర మేయర్ వై.సునీల్రావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలో రూ.75 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 12వ డివిజన్లో రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, 11వ డివిజన్లో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, 50వ డివిజన్లో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, 55వ డివిజన్లో రూ.25లక్షలతో, 19వ డివిజన్లో రూ.30లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నగరపాలక సంస్థకు రూ.2.50 కోట్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. గతంలో సీఎం అక్యూరెన్స్ కింద విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. గత పాలకవర్గ సమావేశంలో రూ.36కోట్లతో చేపట్టనున్న 290 పనులకు ఆమోదం తెలుపగా టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. వేసవి ముగిసేలోగా పనులను ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామన్నారు. కాంట్రాక్టర్లు పనులను నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అన్ని డివిజన్లలోనూ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పనులను త్వరగా పూర్తి చేయించేందు కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్పొరేటర్లు తోట రాములు, ఆకుల నర్మద, అంజయ్య, పెద్దపల్లి జితేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్య లేకుండా చూస్తాం
అన్ని డివిజన్లలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, అంబేద్కర్ రిజర్వాయర్ పరిధిలో నీటి సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని మేయర్ వై.సునీల్రావు పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్ రోడ్డులో చేపట్టిన తాగునీటి పైపులైన్ ఇంటర్ కనెక్షన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ కనెక్షన్ పనులను ఐదురోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ రిజర్వాయర్కు తాగునీటిని సరఫరా చేసేందుకు మెయిన్ పైపులైన్కు సంబంధించి రూ.31లక్షలతో పనులు చేస్తున్నామన్నారు. నగరంలోని అన్ని రిజర్వాయర్లలో ప్రత్యేకంగా వాల్స్ను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక నగరపాలక సంస్థ కరీంనగర్ మాత్రమేనన్నారు. వేసవిలో నీటి సరఫరాలో ఎక్కడా సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నాంపల్లి శ్రీనివాస్, తిరుపతి, మేచినేని వనజ, అశోక్రావు, కంసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.