మాజీ మంత్రి తీరుపై సాధారణ కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఆగ్రహం
ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నేతలు
కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని స్పష్టీకరణ
టీఆర్ఎస్ వెంటే ఉంటా: జడ్పీ చైర్పర్సన్ విజయ
కరీంనగర్, మే 15 (నమస్తే తెలంగాణ): తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన టీఆర్ఎస్ వెంటే ఉంటానని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తే సహించేది లేదని కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో తాను గతం లో జమ్మికుంట జడ్పీటీసీ సభ్యురాలిగా, జమ్మికుంటలో కౌన్సిలర్గా ఎన్నికయ్యానని, ప్రస్తుతం ఇల్లందకుంట జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యేందుకు టీఆర్ఎస్ పార్టీ యే కారణమని స్పష్టం చేశారు. 2001 నుంచి టీఆర్ఎస్లో తాను క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నానని, సీఎం కేసీఆర్ శిక్షణలో రాజకీయంగా ఎదిగానని గుర్తు చేశారు. ఇప్పటికీ, ఎప్పటికీ తాను టీఆర్ఎస్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, తగిన బుద్ది చెబుతామని స్పష్టంచేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం పాటుపడతానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
‘ఈటల’తో ఇబ్బందులు పడ్డాం
జమ్మికుంట, మే 15: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (మంత్రిగా ఉన్నప్పుడు)తో ఒక ఎంపీపీ హోదాలో ఉండి కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 2001 నుంచి పార్టీ అందించిన అనేక పదవులు పొందిన ఈటల రాజేందర్, అదే పార్టీని విమర్శించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు నివాసంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే ఈటల తాను కూర్చున్న చెట్టును తానే నరుక్కున్న వ్యక్తిగా అభివర్ణించారు. కన్న తల్లిలాంటి పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తలతో మాట్లాడించడం తగదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నుంచి బీ ఫారం తీసుకున్నామని, కేసీఆర్ పేరుతో గెలిచామన్నారు. ఆయన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపించాయన్నారు.
కేసీఆరే మా నాయకుడు :మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు
ప్రాణాలను పణంబెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలోనే మున్సిప ల్ పాలకవర్గం పనిచేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టే తమకు ముఖ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదని చెప్పారు. శనివారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందిస్తున్న టీఆర్ఎస్ వెంటే ఉంటామని, సీఎం కేసీఆరే మా నాయకుడని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్తో మాట్లాడి మున్సిపల్కు నిధులు తెచ్చుకుంటామని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఈటల రాజేందర్తో ఏ ఒక్క నాయకుడూ పనిచేయడని, టీఆర్ఎస్లోనే ఉంటామని కౌన్సిలర్, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య స్పష్టం చేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవం లేదు: ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్వీ ఇన్చార్జి పూర్ణచందర్
హుజూరాబాద్టౌన్, మే15: తనకు పోటీ అవుతారన్న నెపంతో బీసీ నాయకులను అణగదొక్కేందుకు ఈటల కుట్రలు పన్నాడని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్వీ ఇన్చార్జి పూర్ణచందర్ ఆరోపించారు. ఈటలకు ఆత్మగౌరవమే లేదని, పదేపదే ఆత్మగౌరవం అంటూ ఆ పదానికి ఉన్న విలువ తీసేస్తున్నారని, ఇకనైనా అలాంటి మాటలు, చేష్టలను మానుకోవాలని హితవు పలికారు. 2004 కంటే ముందు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక అనామకుడని, అసలు ఆయన ఎవరికీ తెలియదని, సబ్బండ వర్గాల ఉద్యమంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కల సాకారమైందని చె ప్పారు. శనివారం హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ బొమ్మతో కారు గుర్తుపై గెలిచిందని మరిచి, ఈటలకు రాజకీయ భిక్ష ప్రసాదించిన సీఎం మీదనే కుట్రలు చేయడం, ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేయడం, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, సంక్షేమ పథకాలపై ఎద్దేవా చేయడం దారుణమన్నారు. బడుగు బలహీన వర్గాల పథకాలపై కామెంట్లు చేయడం వారిని అవమాన పరచడమేనని మండిపడ్డారు. ఈటల చేసింది ఏమిలేదని, బడుగు బలహీన వర్గాల పేరుతో పదవులు అనుభవిస్తూ పైకి వచ్చాడని, డబ్బు సంపాదన త ప్ప ఆయనకు ఇంకోటి తెలియదని ధ్వజమెత్తారు. పార్టీ కోసం పని చేసే వ్యక్తులపై ఉక్కుపాదం మోపింది ఈటల అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని, కేసీఆర్ బాటలోనే పయనిస్తారని స్పష్టం చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలువాలని, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ప్రతి ఇంటిలో తన సాయం ఉంటుందని ఈటల చెప్పుకునే వాడని, కానీ ఆయన సహాయం చేసింది వేళ్లపై లెక్కపెట్టవచ్చని, కానీ ఆయన హాని చేసింది వేలల్లో ఉన్నారని, ఈటల కుట్రలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు.
ఆయన అంటేనే ఒక మోసం:హుజూరాబాద్ ఇన్చార్జి ఆలేటి శ్రీరామ్
ఈటల అంటేనే ఒక మోసం, ఒక నియంత అని టీఆర్ఎస్వీ నాయకుడు బాసవేణి ప్రవీణ్యాదవ్ ఆరోపించారు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. ఈటల మంత్రి హోదాలో ఉండి టీఆర్ఎస్వీ నాయకుడు బాసవేణి ప్రవీణ్పై తప్పుడు కేసులు పెట్టించి, పోలీసులతో కొట్టించి ఆయన మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. ప్రవీణ్ మృతిచెందితే కనీసం ఇంటికి వెళ్లి పరామర్శించలేదని, ఆయనపై విమర్శలు వస్తే అవి నిజం కాదని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ప్రవీణ్ యాదవ్, ఆయన కుంటుంబం టీఆర్ఎస్ వెంట ఉన్నప్పటికీ దవాఖాన్లో ఆయన నౌకరి తీసేయించి, చిత్రహింసలకు గురి చేసి ఆయన చావుకు కారణం నువ్వు కాదా అని ప్రశ్నించారు. చీము, నెత్తురు ఉంటే, ఉద్యమ నాయకుడివైతే హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ప్రజాక్షేత్రంలో చూసుకుందామని సవాల్ విసిరిరారు. మంత్రి గంగుల, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను, నాయకులను ఏకధాటిపైకి తీసుకురావడం పైన టీఆర్ఎస్వీ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ యూత్ నాయకులు సామల రాజారెడ్డి, పోతరవేని అనిల్యాదవ్, కాపర్తి సంతోష్, టీఆర్ఎస్వీ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు శ్రీరామ్, రాజేశ్, జగన్, కిరణ్, వినయ్, శివ, నాగరాజు పాల్గొన్నారు.