నగరంలో లాక్డౌన్ తొలిరోజూ పక్కాగా అమలైంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగాయి.ఈ సమయంలో ప్రజలు నిత్యావసరాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం దుకాణాల వద్ద బారులు తీరి కనిపించారు. టవర్ సర్కిల్లోని కూరగాయల మార్కెట్లో ముందెన్నడూలేనివిధంగా రద్దీ కనిపించింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన వినియోగదారులతో సందడి నెలకొన్నది. పలువురు 10 రోజులకు సరిపడా కూరగాయలు, సరుకులను కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించింది. అయితే పలుచోట్ల కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి.
పలుచోట్ల పికెటింగ్లు..
ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షేంచేందుకు పోలీసులు నగరంలోని నగరంలోని తెలంగాణ చౌక్, కోర్టు చౌరస్తా, నాకాచౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, కమాన్, బస్టాండ్, టవర్సర్కిల్ ఏరియాల్లో పికెటింగ్లు ఏర్పాటు చేశారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల రాకపోకలను నియంత్రించారు. నిబంధనలు ఉల్లంఘిం చిన వాహనదారులకు జరిమానాలు విధించారు. అత్యవసర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఐడీ కార్డులను చూపించి ఆఫీసులకు వెళ్లారు. విధి నిర్వహణ అనంతరం గడువులోగా ఇండ్లకు చేరుకున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు అనుక్షణం పరిస్థితులపై ఆరా తీస్తూ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు.
వెలవెలబోయిన మార్కెట్లు..
10 గంటలకు లాక్డౌన్ నిబంధనలు అమలుకావడంతో మార్కెట్లు, షాపింగ్మాల్స్ కళతప్పాయి. ముఖ్యంగా జన సంచారం అధికంగా ఉండే టవర్సర్కిల్, కమాన్ ఏరియాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు మూతబడడంతో బోసిపోయి కనించాయి. బట్టల షాపులు, సెల్పాయింట్లు, క్రీడా సామగ్రి విక్రయించే దుకాణాలను తెరువలేదు. మంచి ముహూర్తాలు ఉన్నా ఫంక్షన్హాళ్లలో ఎలాంటి శుభకార్యాలు లేకపోవడంతో వెలవెలబోయాయి. దేవలాయాలు, ప్రార్థన మందిరాలను మూసివేశారు.
అత్యవసర సేవలకు అనుమతి..
లాక్డౌన్ నుంచి మినహాయింపుల మేరకు అత్యవసర సేవలు కొనసాగాయి. వైద్య సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు ఐడీ కార్డులను వెంట ఉంచుకొని విధులకు హాజరయ్యారు. హాస్పిటళ్లు, మెడికల్ షాపులు యథాతధంగా తెరిచి ఉన్నాయి. వైద్యశాలల్లో నిరాటకంగా సేవలందించారు. కాగా, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు రోజుమాదిరిగానే కొనసాగాయి.
కొనసాగుతున్న జ్వర సర్వే…
మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటికీ జర్వ సర్వే శరవేగంగా సాగుతున్నది. ప్రతి డివిజన్కు రెండు చొప్పున బృందాలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో సర్వేను పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం సిబ్బంది ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్ కిట్లు అందించారు. ఆరోగ్యవివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సుజాత, ఇతర వైద్యాధికారులు సర్వేను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.