పేదల భూములు గుంజుకున్నప్పుడు ఏమైంది?
ఈటలవి దిగజారుడు మాటలు
ఆయనపోతే పార్టీకి ఏం నష్టం లేదు
ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, నారదాసు
హుజూరాబాద్ రూరల్/వీణవంక, జూన్12: ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న ఈటల రాజేందర్కు పేదల భూములు గుంజుకున్నప్పుడు ఆ ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని పార్టీ ఉమ్మడి జిల్లా వ్యవహారాల ఇన్చార్జి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, నారదాసు లక్ష్మణ్రావు ప్రశ్నించారు. ఈటల రాజేందర్ను పార్టీ నుంచి ఎవరు వెళ్లగొట్టలేదని, తప్పులు చేసి ఆయనే వెళ్లిపోయారని విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వారు గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు ఆయన దిగుజారుడు తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్లో ఎక్కువగా పదవులు అనుభవించింది ఈటల రాజేందర్ అని, ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా ఈటల రాజేందర్కు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన వ్యక్తి కేసీఆర్ అని ఉద్ఘాటించారు. సమావేశంలో నాయకులు బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, ఐలయ్య ఉన్నారు.
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు జీవం..
రాష్ట్రంలో అంతరించిపోతున్న కులవృత్తులకు జీవం పోసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని, సీఎం కేసీఆర్ పాలనలో అన్ని కులవృత్తుల వారు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. వీణవంక మండలం కిష్టంపేట ఫంక్షన్ హాల్లో నాయీబ్రాహ్మణ, రజక సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయీబ్రాహ్మణులు, రజకులు చెప్పిన సమస్యలు విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులు, రజకులు చేసే సేవ చాలా గొప్పదని, సమాజ సేవకులు అని కొనియాడారు. ఈ కులస్థుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సైతం ఇప్పటికే దోబీ ఘాట్లు, మోడ్రన్ సెలూన్లు, సెలూన్లకు ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలు చేసిందని, సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
ఈ రెండు కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏటా 400 కోట్లు ఖర్చు చేస్తున్నదని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు వారి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైతే మరిన్ని సంక్షేమ నిధుల ద్వారా అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. వ్యక్తిని నమ్ముకొని ఏ పని చేయొద్దని, పార్టీని నమ్ముకున్న వారికి అభివృద్ధి, సంక్షేమం చేయాలనే ఆలోచన ఉంటుందని చెప్పారు. పార్టీలో కొంత మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. నాయీబ్రహ్మణులు, రజక కులస్థులు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కో ఆప్షన్మెంబర్ హమీద్, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.