కరీంనగర్ జిల్లాలో 351 కేంద్రాలు
ప్రతి గ్రామంలో అందుబాటులో ఏర్పాటు చేస్తాం
4.31 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం
కనీస మద్దతు ధర కల్పిస్తాం
మూడ్రోజుల్లోనే నగదు జమ చేస్తాం
మాస్కు లేకుండా వస్తే జరిమానా
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
అధికారులతో కొనుగోళ్ల సన్నాహక సమావేశం
కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రైస్ మిల్లర్లు, సింగిల్ విండో చైర్మన్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్, సివిల్ సప్లయ్, మార్కెటింగ్, ఐకేపీ సిబ్బంది, తహసీల్దార్లు, ఇతర అధికారులతో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోలేదని, దీంతో ప్రతి సీజన్లో కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే ఎఫ్సీఐ కొనుగోలు చేసేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర పంటల స్వరూపాన్ని మార్చి వేశారని, ఫలితంగా ఎఫ్సీఐకి ఇచ్చే ధాన్యం పరిమాణం పెరిగిందన్నారు. ఈ యేడాది వచ్చే కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తికి 80 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐకి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎకరానికి 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, దీని ప్రకారం 5,14,258 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చన్నారు. ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 351 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 6.34 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుమతి అంచనా వేయగా, అందులో 4.31 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏ-గ్రేడ్ రకానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868 చెల్లించనున్నట్లు తెలిపారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తాలు లేకుండా, 17 శాతం తేమకు మించకుండా కేంద్రాలకు తేవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. ఈనెల 15 నుంచి యాసంగి వరికోతలు ప్రారంభమవుతాయని, ఇందుకు అనుగుణంగా కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామన్నారు. కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ లేకుండా వచ్చే వారికి జరిమానా విధించాలని అధికారులకు సూచించారు. మండల వ్యవసాయాధికారి షెడ్యూల్ ప్రకారమే ధాన్యం తేవాలని, ఈ మేరకు వ్యవసాయ అధికారులు టోకెన్లు పంపిణీ చేయాలని నిర్దేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు రైస్ మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండదని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్ మిల్లులకు పంపించేందుకు లారీలను సమకూర్చాలన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ విత్తనం నాటిన నుంచి విక్రయం వరకు రైతులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, అన్ని శాఖలు సమన్వయంతో యాసంగి ధాన్యం కొనుగోలు విజయవంతం చేయాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చేసిందని, ధాన్యాన్ని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేస్తుందని తెలిపారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ప్రతి కొనుగోలు ప్రవేశంలో ఇన్వార్డ్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, రైస్ మిల్లులో ధాన్యం అన్లోడింగ్ సమయం తగ్గించాలని సూచించారు. ధాన్యం రవాణాకు రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎల్ శ్రీలతారెడ్డి, డీఏవో వాసిరెడ్డి శ్రీధర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్, సెక్రటరీ సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు, సివిల్ సప్లయ్స్ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా ..?
16 వరకూ బ్యాంకులకు సెలవులే.. ఎందుకంటే?!