లింగంపేట నుంచి మొదటిసారిగా సరుకు రవాణా రైలు పరుగులు
మొదటి రోజు 546 టన్నుల మామిడి కాయలు ఎగుమతి
గతంలో రోడ్డు మార్గాన రవాణా.. కిలోకు 5.20 పైసల వరకు ఖర్చు
నేడు గూడ్స్ ద్వారా 2 మాత్రమే..
ప్రస్తుతం వ్యాపారులకు 14 లక్షలు ఆదా
జగిత్యాల టౌన్, ఏప్రిల్ 12 : జగిత్యాల జిల్లా లింగంపేట టూ ఢిల్లీ కిసాన్ గూడ్స్ రైలు ప్రారంభమైంది. మొదటిసారి జగిత్యాలలోని లింగంపేట రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీకి పరుగులు తీసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలకు రైల్వే డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా రిమోట్ ద్వారా గూడ్స్ను ప్రారంభించగా, లింగంపేట రైల్వేస్టేషన్లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సుకేశ్ దీపక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుకేశ్ దీపక్ మాట్లాడుతూ, మొదటి రోజున 546 టన్నుల మామిడి కాయలను 20 వ్యాగన్లలో లోడింగ్ చేస్తున్నారని తెలిపారు. రాత్రి 12 గంటల వరకు లోడింగ్ పూర్తవుతుందని చెప్పారు. రాత్రి ఒంటి గంటకు లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలు దేరి మంగళవారం రాత్రి ఒంటి గంటకు ఢిల్లీ చేరుతుందన్నారు. జగిత్యాల నుంచి ఢిల్లీకి 546 టన్నుల మామిడి కాయలను లారీల ద్వారా పంపిస్తే సుమారు 23 లక్షలు, మామూలు గూడ్స్ రైలు ద్వారా పంపిస్తే 18 లక్షల ఖర్చవుతుందని, కిసాన్ గూడ్స్ ద్వారా కేవలం 9 లక్షల వ్యయం మాత్రమే కావడంతో పాటు 24 గంటల్లో ఢిల్లీకి చేరుతుందని చెప్పారు. ఈ మేరకు ట్రేడర్స్కు, మామిడి వ్యాపారులకు ట్రాన్స్పోర్టు ఖర్చు సుమారు 14 లక్షల వరకు ఆదా అవుతుందన్నారు. గతంలో మామిడి కాయలను లారీల ద్వారా ఢిల్లీకి ఎగుమతి చేసినప్పుడు కిలో మామిడికాయలకు 5.10పైసల నుంచి 5.20 పైసల వరకు ఖర్చయ్యేదని, ఈ యేడాది కిసాన్ గూడ్స్ రైలు ద్వారా కిలో మామిడికి 2 మాత్రమే ఖర్చవుతుందన్నారు. దీంతో మామిడి రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శుభం జైన్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మామిడి వ్యాపారులు, ట్రేడర్స్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం
IPL 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శాంసన్.. ‘పంజా’ విసిరేనా?