ఉమ్మడి జిల్లా పంట రుణపరిమితి ఖరారు
పంట రుణాల్లో ఆయిల్పామ్కు మొదటిసారి చోటు
ప్రధాన పంటలపై స్వల్ప పెంపు
కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వానకాలం సీజన్లో జిల్లా స్థాయి వ్యవసాయ, బ్యాంకింగ్, నాబార్డు అధికారులతో కూడిన టెక్నికల్ గ్రూప్ కమిటీ సమావేశమై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను నిర్ణయిస్తుంది. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, కూలీలు, ఇతర పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం అవసరం ఉంటుందో పరిశీలించి ఈ కమిటీ రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ఏటా ఒక్కో పంటపై రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు పెంచుతుంటారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి పంటకు గతేడాది రూ.34-35 వేలు నిర్ణయించగా ఈసారి కూడా అంతే ఖరారు చేశారు. పత్తిపై గతేడాది వర్షాధారం కింద రూ.33-35 వేలు నిర్ణయించగా ఈసారి కూడా దానినే కొనసాగించారు. అయితే, నీటి పారుదల కింద గతేడాది ఉన్న రూ.35-37 వేలను ఈసారి రూ.38-40 వేలకు పెంచారు. జొన్న, వేరుశనగ, పసుపు, పెసర, కంది, నువ్వులు తదితర పంటలకు గతేడాది రుణాన్నే తిరిగి ఖరారు చేశారు. అయితే, ఈసారి అనేక కొత్త పంటలకు చోటు దక్కింది. శనగలకు రూ.9-10 వేలు, అలుసందకు రూ.8-9 వేలు, మినుములకు రూ.10-11 వేలు, ఆవాలకు రూ.11-12 వేలు ఖరారు చేశారు. జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే చెరుకు, పసుపు పంటలపై గతేడాది రూ.2వేల చొప్పున పెంచిన కమిటీ ఈసారి దానినే కొనసాగించారు.
ఉద్యాన పంటలకు ప్రాధాన్యం
ఈసారి పంట రుణ పరిమితిలో ఎక్కువగా ఉద్యాన పంటలకు ప్రాధాన్యం కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడిన నేపథ్యంలో ఈ పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసిన ఆయిల్ పామ్కు మొదటిసారి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో చోటు దక్కింది. దీనికి ఎకరాకు రూ.55-57 వేలు ఖరారు చేశారు. కూరగాయల్లో గతంలో కేవలం పచ్చిమిర్చి, టమాటకు మాత్రమే రుణ పరిమితి ఇవ్వగా ఈసారి ప్రతి కూరగాయ పంటకు ఇవ్వాలని నిర్ణయించారు. టమాట ఎకరాకు ఈసారి రూ.50-52, పచ్చిమిర్చికి నీటి పారుదల కింద రూ.55-58 ఖరారు చేశారు. ఇక వంకాయ, మునగ, చామగడ్డ, అల్లం, వెల్లుల్లి, కందగడ్డ, బీర, కాకర, సోర, క్యాబేజీ, ఉల్లి, ఆలుగడ్డ, బెండ, క్యారెట్, కాలీఫ్లవర్, కరివేపాకు, కొత్తి మీర, దొండ, క్యాప్సికమ్ వంటి కూరగాయలకు ఈసారి బ్యాంకుల నుంచి పంట రుణాలు అందనున్నాయి. ఉద్యానవన తోటలో ప్రధానంగా అరటి, బత్తాయి, నిమ్మ, సపోట, రేగు, అంజూరా, డ్రాగన్ ఫ్రూట్స్, వాటర్ మిల న్, మస్క్మిలన్, బొప్పాయి, కొబ్బరి, యాపిల్ బేర్, జీడి సాగుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో చోటు దక్కింది. మామిడి, మల్బరీ సాగుకు కూడా ఎప్పటిలాగే రుణ పరిమితిని ఖరారు చేశారు.
బ్యాంకులు కరుణిస్తేనే అమలు
ఏటా టీజీసీ కమిటీ సిఫారసులను బ్యాంకర్లు సులువుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నాలుగైదు ఎకరాలున్న రైతు తన క్షేత్రంలో కనీసం రెండు మూడు రకాల పంటలు సాగు చేస్తాడు. కానీ, బ్యాంకర్లు మాత్రం బల్క్గా కొంత మొత్తాన్నే రుణంగా కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఐదెకరాలున్న రైతు మూడెకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా గరిష్ఠంగా రూ.1.05 లక్షల రుణం ఇవ్వాలి. మరో రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే గరిష్ఠంగా రూ.74 వేలు రుణంగా ఇవ్వాలి. ఇలా ఇచ్చినపుడే రైతులపై పెట్టుబడి భారం పడదు. కానీ, బ్యాంకర్లు మాత్రం బల్క్ గా రూ.50 వేల నుంచి రూ.లక్షకు మించి రుణా లు ఇవ్వడం లేదని ఏటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్పై అవగాహన లేని రైతులు బ్యాంకర్లు ఇచ్చిందే మహాభాగ్యమన్నట్లు తీసుకెళ్తుంటారు. 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.10వేల చొప్పున అందిస్తున్న నేపథ్యంలో రైతులకు కొంత ఊరట లభించింది. ఈ పథకం అనేది లేకుంటే పూర్తిగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడే వారు. అయితే, పంట రుణా లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు తీసుకెళ్లడం లేదని కొందరు బ్యాంకర్లు వాదిస్తున్నారు. ఏదేమైనా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
ఇవి కూడా చదవండి
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం
బెయిర్స్టో ఔట్.. ఆశలన్నీ మనీశ్ పాండే పైనే