కరీంనగర్ ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్మార్ట్సిటీని సాధించడంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ కీలక పాత్ర పోషించారు. తర్వాత కూడా స్మార్ట్ సిటీలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాదు, నగరం రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నగరంలో పలు మార్పులు కనిపిస్తుండగా, తాజాగా ఓ కొత్త ఆలోచన చేశారు. కూరగాయల మార్కెట్ల వద్ద వ్యర్థాలతో ఏర్పడుతున్న అపరిశుభ్రత వాతావరణం, ఇతర కారణాలను పరిగణలోకి తీసుకున్న ఆయన, ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో బయోగ్యాస్, బయోమాన్యూర్ ప్లాంట్స్ ఏర్పాటుకు అడుగులు వేశారు.
ఐఐసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్తవేత్తల ఆధ్వర్యంలో కరీంనగరంలో బయోగ్యాస్, బయో మాన్యూర్ ప్లాంట్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే కాదు.. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, కరీంనగర్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడారు. ఆ మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఐఐసీటీ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలను ఒక్కో ప్లాంట్లో 10 టన్నుల వరకు వినియోగించి బయోగ్యాస్, బయోమాన్యూర్ ఉత్పత్తి చేయనున్నారు. ఒక్కో ప్లాంట్కు వ్యయం ఐదు కోట్లు అవుతుండగా.. స్మార్ట్ సిటీ నిధుల నుంచి వినియోగించనున్నారు.
త్వరలోనే ఏర్పాటు చేస్తాం : వినోద్కుమార్
కరీంనగర్ స్మార్ట్ సిటీలో బయోగ్యాస్, బయోమాన్యూర్ ప్లాంట్లను త్వరలోనే నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసీటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యర్థాలతో వాతావరణం కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంటుందన్నారు. కరీంనగరంతోపాటు జిల్లాలోని వివిధ మార్కెట్ల నుంచి ఈ వ్యర్థాలను సేకరించి, బయోగ్యాస్, బయోమాన్యూర్ను ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. హైదరాబాద్లో జరిగిన భేటీలో ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్వీ సత్యనారాయణ, డాక్టర్ ఏ గంగాగ్నిరావు, సాంకేతిక ప్రతినిధులు సీహెచ్ సతీశ్రావు, కేఎల్ఎన్ రాజు పాల్గొన్నారు.