ప్రణాళిక ప్రకారం ముందుకు
హైరిస్ గ్రూప్లో ఉన్న వారికి స్పెషల్ వ్యాక్సినేషన్
వైరస్ వ్యాప్తి అరికట్టే అవకాశం
మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్/విద్యానగర్, జూన్ 5: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజలకు సేవలందించే స్ట్రీట్ వెండర్స్, కిరాణా దుకాణాలు, లాండ్రీషాపులు, సెలూన్లు, తదితర హైరిస్ గ్రూప్ వారికి కరోనా నుంచి రక్షణ కల్పించి, తద్వారా సమాజంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో హైరిస్క్ గ్రూప్ వారికి శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో 15 వేల మందిని గుర్తించామని, వారి కుటుంబ సభ్యులను కలుపుకొని మొత్తం 30 వేల మందికి మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, అపోహలు పెట్టుకోకుండా టీకా వేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు
నగరంలో హైరిస్క్ గ్రూప్ పరిధిలోకి వచ్చే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. నాలుగు రోజులుగా సర్వే చేపడుతున్నామని, ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. టీకా తీసుకోవడంతో కరోనా రిస్క్ తగ్గడమే కాకుండా, ఒకవేళ వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
పది రోజుల్లో పూర్తి చేస్తాం
నగరంలో హైరిస్క్ గ్రూప్ పరిధిలోకి వచ్చే వారికి పది రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని నగర కమిషనర్ క్రాంతి తెలిపారు. ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది డివిజన్ల వారీగా సర్వే చేసి కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఫోన్కు మెస్సేజ్ రాగానే ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేసుకోవాలని ప్రజలను కోరారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణిహరిశంకర్, కార్పొరేటర్లు, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు.