సకల సృష్టి, స్థితి, లయ కారిణిగా ప్రాకృత్రిక చైతన్య స్వరూపమైన అమ్మవారి ఆరాధనే దసరా పండుగ. హిందువులంతా నిష్టగా జరుపుకునే వేడుక. అమ్మవారిని ఆరాధించడం.. ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించి పదో రోజు దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. మనలో పది అవగుణాలను హరించేది ఈ దశహార పండుగ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానవత్వ, అహంకార, ఈ పది దుర్గణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుకనే దీనిని విజయదశమి అని కూడా అంటారు.
దసరా నేపథ్యం
మహిషాసురుడు బ్రహ్మవరం వల్ల గర్వితుడై ముల్లోకాలను బాధ పెడుతుంటే ఆ బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులను వేడుకున్నారు. త్రిమూర్తులు సకల లోక పావని దుర్గామాతను స్తుతించారు. దుర్గామాత తొమ్మిది రోజుల పాటు భీకర పోరాటం సాగించి తొమ్మిదో రోజు మహిషాసురున్ని సంహరిస్తుంది. ఆరోజు ఆశ్వయుజ మాసం శుధ్ధ నవమి. సకల జగత్తుకు మూలం. త్రిమూర్తులకు శక్తిప్రదాత. త్రిలోకేశ్వరి సకలాభీష్ట ప్రదాయిని దుర్గామాత దుష్ట శిక్షణ చేసిన మరునాడు జరుపుకున్న విజయోత్సవమే విజయ దశమి. ఈ రోజు పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయం. ఆ రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి. అందుకే దుష్ట శిక్షణపై విజయంగా భావించి విజయ దశమిగా మారినట్టు పురాణాలు ప్రవచిస్తున్నాయి.
ఆయుధ పూజ
మహిషాసురుణ్ని వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో అవతరించింది. దేవతలు తమ ఆయుధాలను అందించడంతో ఆదిశక్తి మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్నది. హిమవంతుడు ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసురుణ్ని వధించి విజయవిలాసిగా మూర్తిమత్వాన్ని చాటుకుంది. అందువల్లే ఆయుధాల్ని పూర్వం రాజులు అలంకరించి పూజించేవారు. ఆ ఆచారంతోనే దసరా రోజు యంత్రం, వాహన, పనిముట్లకు పూజలు చేయడం, పూలతో అలంకరించడం, ఫ్యాక్టరీలు, భారీ వాహనాల ముందు జంతు బలి ఇవ్వడం ఆనవాయితీ.
పాల పిట్ట దర్శనం శుభదాయకం
దసరా పండుగ రోజు సాయంత్రం పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రెపిట్టను చూస్తే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం.
శమీ పూజ..
విజయదశమి రోజు శమీ దర్శనం, శమీ పూజ చేయాలని శాస్త్ర వచనం అంటే ఊరి పొలిమేరలను దాటి వెళ్లాలి. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. విజయదశమి రోజు పూజలందుకునే శమీ వృక్షానికి సంబంధించిన పురాణగాథ ఒకటి ఉంది. పూర్వం ప్రజాపతి ఒక్కో దానినే సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాడు. అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాప్రతినే కాల్చివేయ సాగింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజాపతి అగ్నిని శమింపజేసేందుకు పచ్చని చెట్టును ఒక దానిని సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాడు. అలా అగ్నిని శమింపజేయడానికి ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం. అటువంటి శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకుని తీసుకు వచ్చి పెద్ద వారికి ఇచ్చి వారికి పాదాభినందనం చేసి ఆశీర్వాదం పొందడం ఆచారం. ఇలా శమీ వృక్షాన్ని దర్శించి పూజించడం వల్ల అన్నింటా విజయాలు లభిస్తాయని, పూర్వం శ్రీరామచంద్ర మూర్తి శమీ పూజ చేసి లంకపై దండెత్తి విజయం సాధించినట్లు, రాజులు శత్రు దేశాలపై దండయాత్ర చేసే ముందు కూడా శమీ పూజ చేసేవారని పురాణాల ద్వారా తెలుస్తున్నది.
పండుగ ఏర్పాట్లలో జిల్లా వాసులు
విజయదశమి సంబురాలను బుధవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు ఆయా కాలనీలు, దుర్గామాత మండపాల వద్ద శమీ పూజలు, వాహన పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో, ఎండోమెంట్ ఆధ్వర్యంలో గిద్దెపెరుమాళ్ల ఆలయంలో, మార్క్ఫెడ్ మైదానంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో దసరా సంబురాలు, రాంలీలా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.