విద్యానగర్, జనవరి 10: కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేయాలని, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్కు బూస్టర్ డోస్ అందించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒమిక్రాన్పై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ 6 శాతం మిగిలి ఉందని, దీన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వారియర్స్తో పాటు 60 ఏళ్లు పైబడి అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు బూస్టర్ డోస్ అందించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, మాసులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్తపల్లి, తిమ్మాపూర్ పీహెచ్సీల పరిధిలో రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.