వేములవాడ/ వేములవాడ టౌన్, ఆగస్టు 27: కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు న్యాయసేవలు చేరువయ్యాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. తాను లా కార్యదర్శిగా ఉన్నప్పుడు తెలంగాణ సర్కారు సహకారంతో 50 కోర్టులు ఏర్పాటు చేశానని చెప్పారు. శనివారం వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత వేములవాడలోని కోర్టును సందర్శించారు. కార్యాలయాలు, వసతి గదులను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టును సందర్శించారు. అనంతరం ఫోక్సో కోర్టు హాల్లో న్యాయాధికారులతో సమీక్షించారు. ఆయాచోట్ల జడ్జి మాట్లాడుతూ వేములవాడలో సీనియర్ సివిల్కోర్టు ప్రారంభం కావడంతో న్యాయమూర్తి అందుబాటులో ఉన్నారని చెప్పారు. లాయర్లు ఆయనకు సహకరించి ప్రజలకు సత్వర న్యాయమందేలా చూడాలని కోరారు. ఇక్కడి కోర్టు భవనం చిన్నగా ఉన్నందున పై అంతస్థు నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల సుధాకర్ రెడ్డి హైకోర్టు జడ్జిని కలిశారు. వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కోనరావుపేట మండలాన్ని కూడా వేములవాడ కోర్టు పరిధిలోకి మార్చాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు.
సంబంధిత అధికారితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ భవననిర్మాణానికి సహకరించాలని కోరగా స్థానిక ఎమ్మెల్యే సహకారం తీసుకోవాలని న్యాయవాదులకు సూచించారు. అనంతరం వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తిని ఘనంగా సన్మానించారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి ప్రేమలత, సీనియర్ సివిల్కోర్టు న్యాయమూర్తి రవీందర్, జూనియర్ సివిల్కోర్టు న్యాయామూర్తి ప్రతీక్ సిహాగ్, డీఎస్పీ నాగేంద్రాచారి, ఏజీపీ గుడిసె సదానందం, ఉపాధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరేళ్ల తిరుమల్గౌడ్, కొడిమ్యాల పురుషోత్తం, పిట్టల మనోహర్, నగుబోతు విష్ణు, అవదూత రజనీకాంత్, అనిల్కుమార్, కముటం అంజయ్య, అభిలాష్, నాగుల సంపత్, బొడ్డు ప్రశాంత్, పిల్లి మధు, పంపరి శంకర్, సుజాత, అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.
రాజన్న సన్నిధిలో పూజలు..
రాజన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు జడ్జి సంతోష్రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రాజన్నసిరిసిల్ల జిల్లా జడ్జి ప్రేమలత పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. ఆలయంలో అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి అద్దాలమండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా, ఆలయ ఏఈవోలు శ్రీనివాస్,నవీన్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట వేములవాడ కోర్టు న్యాయమూర్తులు రవీందర్, ప్రతిక్ సిహాగ్, ఎస్పీ రాహూల్హెగ్డే, జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్, ఆర్డీవో లీల ఉన్నారు.