వేములవాడ టౌన్,ఆగస్ట్ 27: శ్రావణ మాసంలో వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సంద్రమైంది. మహాశివుడికి ప్రీతిపాత్రమైన ఈ నెలలో స్వామివారిని ఆరాధిస్తే మోక్ష సిద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో రాష్ట్రనలుమూల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా ఆది, సోమ వారాల్లో భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. సుమారు 5లక్షల మంది శ్రీరాజరాజ్వేరస్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ మాసంలో అర్చకులు ప్రతి సోమవారం రాజన్నకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన తదితర పూజలు చేశారు. అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వరస్వామి సన్నిధిలోనూ అభిషేకాలు, ప్రదోషపూజలు నిర్వహించారు. మహిళలు మంగళకరంగా భావించే శ్రావణ శుక్రవారాల్లో మరో అనుబంధ ఆలయమైన శ్రీ మహాలక్ష్మివారి సన్నిధిలో లలితా సహస్రనామార్చన, శ్రీసూక్తంతో విశేష పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు, ఓడి బియ్యం సమర్పించారు. ముత్తైదువులకు వాయినాలిచ్చి తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాని ఆకాంక్షిస్తూ సుమంగళి వ్రతాలు, నోములు నిర్వహించారు.
రికార్డుస్థాయిలో ఆదాయం..
రాజన్న ఆలయానికి శ్రావణ మాసంలో ముందెన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో రూ. 8.66 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా రెండేళ్లుగా అతితక్కువగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రావణంలో స్వామివారి హుండీల ద్వారా రూ. 3. 70 కోట్లు, లీజుల ద్వారా రూ. 38 లక్షలు, కోడె టికెట్లకు రూ. 1.66 కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ. 37 లక్షలు, ప్రసాద విక్రయాలకు రూ. 1. 43 కోట్లు, శీఘ్రదర్శనం టికెట్ల ద్వారా రూ. 23 లక్షలు, ధర్మశాలల ద్వారా రూ. 3 2 లక్షలు, కల్యాణ టికెట్ల ద్వారా రూ. 31 లక్షలు, అభిషేక టిక్కెట్ల ద్వారా రూ. 26 లక్షల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
సౌకర్యాలతో భక్తుల సంతృప్తి
శ్రావణమాసంలో శైవక్షేత్రమై న రాజన్న ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే ఈ యేడు రద్దీ అధికంగా ఉంటుందని భావించి అందుకనుగుణం గా ఏర్పాట్లు చేసి నం. ఎప్పటికప్పుడు ఆలయ ఉద్యోగులు, సి బ్బందిని, ఎస్పీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా చర్యలు తీసుకున్నం. భక్తులు సైతం ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. – ఈఓ రమాదేవి