రాజన్న సిరిసిల్ల, మే 31 (నమస్తే తెలంగాణ) : ఇన్నాళ్లూ కాయాకష్టం చేసుకుని ఎల్లదీసిన బతుకులవి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకున్నా రూపాయి వెనకేసుకునే పరిస్థితి లేని జీవితాలవి. కూలీ నాలీ చేసుకుని బతికే దళితులపై సీఎం కేసీఆర్ చూపుతున్న ఆదరణతో వాళ్ల జీవితాలే మారిపోతున్నాయి. బృహత్తర దళితబంధు పథకంతో వెలుగులు నిండుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్లో దిగ్విజయంగా అమల్లోకి రాగా, కొద్దిరోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రక్రియ వేగవంతమైంది. సర్కారు మంజూరు చేసిన రూ.10 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. జిల్లాలో తొలి విడత 205 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, మెజార్టీ మంది కుటీర పరిశ్రమల స్థాపనపైనే ఆసక్తి చూపుతున్నారు.
పరిశ్రమల స్థాపనపైనే ఆసక్తి..
జిల్లాలో దళిత బంధు పథకం పకడ్బందీగా అమలవుతున్నది. ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తుండగా, జిల్లా పరిధిలో ఉన్న సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో 205 మందిని సెలెక్ట్ చేశారు. అయితే పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం లబ్ధిదారులు మోటారు వాహనాలపైనే మక్కువ చూపుతున్నారు. కానీ జిల్లాలో మాత్రం నలుగురైదుగురు కలిసి సంయుక్తంగా కుటీర పరిశ్రమలు స్థాపించేందుకు చాలా మంది ఆసక్తిచూపడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో భవన నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ పరిశ్రమకు బాగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో సిమెంట్ దుకాణం, ఇటుకల తయారీ, బ్యాంగిల్స్ స్టోర్, సూపర్ మార్కెట్లు పెట్టుకునేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఈ క్రమంలో మొదటి విడుతలో 120 మంది లబ్ధిదారులకు గత అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ కూడా అందజేశారు. ఇప్పటికే ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో కొంత మంది లబ్ధిదారులు కలిసి రైస్మిల్లు, హరిదాస్నగర్లో పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. పరిపాలనాపరమైన అనుమతులు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రౌండింగ్ వేగవంతం
పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చిన లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ను అధికారులు వేగవంతం చేశారు. పరిశ్రమలకు అవసరమయ్యే కొటేషన్లు తెచ్చుకున్న వారికి పరికరాలు నాణ్యమైనవి కొనుగోలు చేసేలా పరిశ్రమలు, ఎస్సీ కార్పొరేషన్, గ్రామీణాభివృద్ధి శాఖలు పర్యవేక్షిస్తున్నాయి. వివిధ కంపెనీల ఇంజినీర్లతో పరికరాల నాణ్యతను పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నారు. పెట్టుబడిపెట్టి వ్యాపారంలో నష్టపోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాపారం ఎలా చేయాలన్న అంశంపై లబ్ధిదారులకు ప్రముఖ వ్యాపార వేత్తలతో అవగాహన కల్పిస్తున్నారు. కూలీ నుంచి యజమానిగా మారి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నందుకు దళిత బిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పది మందికి పని చూపుత..
నేను పదిహేనేళ్ల సంది పెయింటర్గా పనిచేస్తున్న. ఇన్నేళ్ల సంది ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలె. తెలంగాణ వచ్చినంకనే మా బతుకులు మారుతున్నయ్. 65 ఏళ్లున్న మా అవ్వకు గత సర్కారు ఇచ్చిన పింఛను మందుగోలీలకు సరిపోలె. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక 2016 ఇస్తున్నది. నన్ను దళితబంధు కింద ఎంపిక చేసింది. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)న కేటీఆర్ సారు ప్రొసీడింగ్ ఇచ్చిండు. పాసుబుక్కు పట్టుకొని బ్యాంకుకు పోతే.. నా అకౌంట్ల పది లక్షలు పడ్డయని సార్లు చెప్పిన్రు. మస్తు సంబురపడ్డ. ఇండ్లకు రంగులేస్తున్న నేను ఏనాడూ చేతిల పదివేల రూపాయలు చూడలె. అలాంటిది ఇప్పుడు పది లక్షలు వచ్చినయ్. ఈ పైసలతోని నేను సెంట్రింగ్ పని పెట్టుకుంట. పది మందికి పని చూపుత.
– రాగుట్ల నరేశ్, లబ్ధిదారుడు (రుద్రంగి మండలం)
మంచి పేరు తెచ్చుకుంట
నేను వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న. దళితబంధు పథకం అంటూ ఊర్లకొచ్చి సార్లు మీటింగ్లు పెడితే వచ్చేదా? పోయేదా..? అనుకున్న. మా సుట్టాలందరూ దళితబంధులో నా పేరు రాయించికోమని చెప్పిన్రు. రూ.పదిలక్షలు వట్టిగనే ఇత్తరంటే మాటలా అనుకున్నా..? అంబేద్కర్ జయంతి రోజు సిరిసిల్లకు రమ్మంటే పోయిన. మంత్రి కేటీఆర్ సార్తోటి కూసుండ పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి రూ.10లక్షలంటూ ఓ కాగితం చేతికిచ్చిండ్రు. ఎన్నడు మంత్రినే సూడనోడిని ఆయన చేతుల్తోనే చెక్కు తీసుకుంటే సంబురమనిపించింది. నాలుగు రోజులకే ఖాతాలు రూ.పదిలక్షలు ఏసిండ్రు. సెంట్రింగ్ లేదా సిమెంట్ ఇటుకల తయారీ చేద్దామనుకుంటున్న. అందులో పనిచేసిన అనుభవం ఉంది. ఏదైనా పెట్టుకుని కేసీఆర్ సార్పేరు నిలబెడుత. షేటునని అనిపించుకుంట.
– మాదాసు భూమయ్య, నిజామాబాద్ (కోనరావుపేట మండలం)