నమస్తే నెట్ వర్క్, అక్టోబర్ 5 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుని, టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంపై అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. విజయ దశమి శుభ ముహూర్తాన సంచలన నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రకటన దేశంలో మరో కీలక మలుపు కానుందని, సబ్బండ జనుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీర్ఆఎస్ ఏర్పాటుపై పలువురు ప్రముఖులు ‘నమస్తే తెలంగాణ’తో మనోగతాన్ని వెల్లడించారు.
K
మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆర్..
గుజరాత్కు సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాలకు నిధులు ఇవ్వడం లేదంటూ నాడు మోదీ ప్రచారం చేశారు. దేశ ప్రధాని అయిన తర్వాత మోదీ సైతం అదే వ్యవహారశైలిని అవలంబిస్తున్నాడు. చిన్న రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. పన్నుల రూపంలో రాష్ర్టాల నుంచి డబ్బులు దండుకుంటున్న మోదీ ఆయా రాష్ర్టాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో మొండి చేయిచూపుతున్నడు. కేసీఆరే మోదీకి ప్రత్యామ్నాయ శక్తి.
– బొల్లి రాంమోహన్, టీఆర్ఎస్ నాయకుడు
జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు..
కేసీఆర్ ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుందని దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నరు. జనహితం కోసమే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. నాడు రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. బీజేపీ పాలనపై ప్రజలందరూ విసుగుచెంది ఉన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు బీఆర్ఎస్ ద్వారా తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
-జిందం చక్రపాణి, బీ(టీ)ఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు
దేశ రైతాంగానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాలనలో రైతు వ్యతిరేక విధానాలకే ప్రాధాన్యమిచ్చింది. దేశ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యత కల్పించి రైతు బాంధవుడిగా నిలిచారు. దేశ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. భవిష్యత్లో కేసీఆర్ నాయకత్వంలో దేశ రైతాంగం సుభిక్షంగా మారుతుంది.
– గడ్డం నర్సయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్
ఆటో కార్మికులకు మంచిరోజులు వస్తయ్
సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి వచ్చిండంటే దేశంలోని ఆటోకార్మికులకు మంచిరోజులు వచ్చినట్లే. తెలంగాణ రాకముందు ఆటోకు ఫిట్నెస్, టాక్స్లు కట్టేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ వచ్చినంక మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిట్నెస్, టాక్స్ మాఫీ చేసి మా ఆటో కార్మికులకు కొండంత ఆత్మవిశ్వాసం పెంచిండు. తెలంగాణ రాష్ట్రం లెక్క దేశం మొత్తం ఫిట్నెస్, టాక్స్లు రద్దు చేసి ఆటోకార్మికులకు అండగా ఉంటారన్న నమ్మకం ఉన్నది. దేశరాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్ సార్ విజయం సాధించి దేశాన్ని అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం నాకు ఉన్నది.
– చీకట్ల కనుకయ్య, ఆటోకార్మికుడు, కొలిమికుంట(చొప్పదండి)
దేశంలోని అన్ని మతాలు, కులాలకు మేలు
రాష్ట్రంలోని అన్ని కులాలకు, మతాలకు మేలు చేస్తున్న బీ(టీ)ఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా అవతరించి దేశాన్ని పాలిస్తే దేశంలోని అన్ని కులాలకు, మతాలకు మేలవుతుంది. ప్రతీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. అందరి అవసరాలు, అక్కెరలు తెలిసిన నేత సీఎం కేసీఆర్ సార్. అందరినీ సమానంగా చూసే ఆయన నాయకత్వంలో దేశం మరింత బాగుపడుతుంది.
– ఎండీ ఫయూమ్, మైనార్టీ నాయకుడు, కో-ఆప్షన్ సభ్యుడు( పెద్దపల్లి మున్సిపాలిటీ )
జాతీయ పార్టీ చారిత్రక నిర్ణయం
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ను ప్రక టించడం చారిత్రక నిర్ణయం. ఒక దశ, దిశను చూపే పార్టీ గాని, సరైన నేత గాని జాతీయ స్థాయిలో లేక పోవడంతో అపారమైన రాజకీయం అనుభవం, ప్రజలకు సుపరిపాలన అందించగల సత్తా ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దేశంలో సరికొత్త విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే సంకల్పంతో బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటిదాకా రాష్ట్ర పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పేరుతో ఆవిర్భవించడం సంతోషంగా ఉంది. ప్రజల ఆదరణతో బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో మంచి ఫలితాలను సాధించడం ఖాయం.
– డా.కల్వకుంట్ల సంజయ్, రాష్ట్ర నాయకుడు
నాడు రెండొందలు.. ఇప్పుడు వెయ్యి
నాడు నేను, నా భర్త జగన్ ఇద్దరం కలిసి కూలీ పనులకు పోతె రోజూ ఇద్దరం కలిసి రూ.400 సంపాదించెటోళ్లం. వాటితోనే మా ఇద్దరు కొడుకులు, మేము బతకాలంటే ఎంతో కష్టమయ్యేది. ఈ టైంలనే దళితబంధు వచ్చి మా బతుకులు మార్చింది. ఈ పథకం ద్వారా మేం స్వస్తిక మినీ సూపర్ మారెట్, హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ను విద్యానగర్లో ఓ ఇల్లుని అద్దెకు తీసుకొని పెట్టుకున్నం. మొదట ఫిబ్రవరిల రూ.5 లక్షలతోటి దుకాణం పెట్టుకోగా రోజుకు రూ.1000 చొప్పున నెలకు రూ.30,000 సంపాదిస్తున్నం. ఇందులో రూ.పది వేలు కిరాయి పోగా రూ.20 వేల వరకు మిగులుతున్నయ్. ఇప్పటివరకు రూ.1,80,000 సంపాదించినం. కూలి పనులకు వెళ్తే పొద్దుగాల నుంచి పొద్దుగూకె దాకా పని చేసినా రెండు, మూడు వందలే వచ్చేవి. ఇప్పుడు మా షాప్లోనే ఇద్దరం పని చేసుకుంట రోజుకు వెయ్యి సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. ఇంత గొప్ప పథకం పెట్టిన కేసీఆర్ సార్ జాతీయ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా పరిపాలన చేస్తే ఇంతకన్నా గొప్ప పథకాలు దేశ ప్రజలకు అందుతయ్.
– గొర్రె రజిత, స్వస్తిక మినీ సూపర్ మారెట్, హోల్సేల్ అండ్ రిటైల్, దళితబంధు లబ్ధిదారు (హుజురాబాద్టౌన్)
దేశానికి కేసీఆర్ అవసరం
బీజేపీ అవలంభిస్తున్న విధానాల వల్ల దేశం అధోగతి వైపు ప్రయాణిస్తున్న ది. ఇలాంటి సమయంలో ఒక విజన్ ఉన్న కేసీఆర్ వంటి నాయకుడి అవసరం దేశానికి ఎంతో ఉన్నది. ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. అభివృద్ధిలో దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా తెలంగాణను ముందు వరుసలో నిలిపిన ఘనత కేసీఆర్ది. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరందిస్తున్నరు. రైతుల అభివృద్ధి కోసం రైతుబంధు, బీమా, 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కనుక దేశ ప్రజలు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు గనుకనే ప్రజల డిమాండ్ మేరకు పార్టీని బీఆర్ఎస్గా విస్తరిస్తున్నారు.
– చల్ల హరిశంకర్, టీఆర్ఎస్ నాయకుడు (కరీంనగర్ కార్పొరేషన్)