కరీంనగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు పల్లెలు అంటే నడిచేందుకు వీలులేని వీధులు, పక్కనే నిండిపోయి కంపుకొడుతున్న డ్రైనేజీలు, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం కనిపించేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు 30 రోజుల పాటు మొదటిసారి నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో చైతన్యాన్ని రగిలించింది. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలపై అన్ని గ్రామాల ప్రజలు సామాజిక యుద్ధాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక అంశాలను ఎజెండాలుగా పెట్టుకొని 30 రోజుల పాటు శ్రమదానాలు చేసి పరిశుభ్రంగా మార్చుకున్నారు. ప్రతి పల్లెలో ఐకమత్యం కనిపించింది. గ్రామ సభలు నిర్వహించుకుని స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేసుకున్నారు. దారుల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం, డ్రైనేజీలను, ప్రభుత్వ సంస్థల్లో శ్రమదానాలు చేసి శుభ్రంగా మార్చుకోవడం, పాడుబడిన ఇండ్లను తొలగించడం, వాడకంలో లేని బావులు, బోరు బావులను పూడ్చుకోవడం వంటి ప్రధాన పనులు చేయడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారిపోయాయి. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం 2020 జనవరి 2 నుంచి 12 వరకు, 2020 జూన్ 1 నుంచి 8 వరకు, 2021 జూలై 1 నుంచి 10 వరకు మొత్తం నాలుగు విడతల్లో చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి.
అభివృద్ధి.. ఆహ్లాదం ఆ పల్లె సొంతం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా స్థానిక సర్పంచ్ మీసాల అంజయ్య గ్రామస్తులను ఏకతాటిపైకి తెచ్చారు. గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకున్నారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకుని ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుతున్నారు. గతంలో డెంగీ, మలేరియా వంటి రోగాల బారినపడ్డ ప్రజలు.. మూడేళ్లుగా అలాంటి రోగాలు లేకపోవడంతో హాయిగా జీవిస్తున్నారు. పెద్ద గ్రామమైన రామకృష్ణాకాలనీకి ఒక్క ట్రాక్టర్ సరిపోకపోవడంతో సర్పంచ్ అంజయ్య, పాలకవర్గం తీర్మానంతో మరో ట్రాక్టర్ను సమకూర్చుకున్నారు. చెత్తా చెదారం ఎత్తడానికి ఒకటి, మొక్కలకు నీళ్లు పోసేందుకు మరొకటి వినియోగిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలను ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తుండడంతో ఈ గ్రామంలోనే అధికారులు బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ వనంలో 8,350 మొక్కలు నాటారు. 30 గుంటల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మరో 2 వేల మొక్కలు పెంచుతున్నారు. రోడ్ల వెంట మరో 2 వేలకుపైగా మొక్కలను రక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది.
ప్రతి పల్లెలో మార్పులు
గతానికి, ఇప్పటికీ పోల్చుకుంటే ప్రతి పల్లెలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిశుభ్రమైన వీధులు, పూడిక లేని డ్రైనేజీలు కనిపిస్తున్నాయి. ఫలితంగా దోమల వ్యాప్తి తగ్గి సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గింది. ప్రతి రోజూ ఉదయం పంచాయతీల ట్రాక్టర్లు ఇంటింటికీ తిరిగి తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరిస్తున్నాయి. పారిశుధ్య సిబ్బంది ఈ చెత్తను డంప్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్లలో వేసి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఈ ఎరువును ప్రకృతి వనాల్లోని మొక్కలకు అందిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఎరువు అందివచ్చే పంచాయతీలు అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీరు అందుబాటులోకి రావడంతో కలుషితనీటితో వచ్చే వ్యాధులు తగ్గిపోయాయి. గతంలో నిరుపేదలు చనిపోతే దహనసంస్కారాలు చేయడం వారి కుటుంబ సభ్యులకు కష్టతరంగా ఉండేది. ఇప్పుడు వైకుంఠధామాల్లో కులాలకతీతంగా నిర్వహిస్తుండగా, సామాజిక అంతరాలను చెరిపేశాయి. దాదాపు అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా ఎదుగుతున్నాయి. వీటిలో కొందరు ఇప్పుడు మార్నింగ్ వాక్ కూడా చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో భూముల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి.
పర్యవేక్షణకు ప్రత్యేక యాప్..
పల్లెల్లో పారిశుధ్యాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రతి రోజూ ఈ యాప్ ద్వారా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. డీఎస్ఆర్ (డెయిలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్తో నిర్వహించే ఈ యాప్లో రెగ్యులర్గా ఆరు అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, చెత్త సేకరణ ఉంటాయి. ఇందులో ప్రతి రోజూ ఏవైనా మూడు చేసినట్లు ఫొటోలు అప్లోడ్ చేసి ఆ పనిని వివరించాలి. అంతేకాకుండా ప్రతి నెలా 21 నుంచి 10 ఫోల్డర్లలో నెలవారీ నివేదికలను పంచాయతీ కార్యదర్శులు అధికారులకు నివేదించాలి. దీంతో పాటు ఏ, బీ, సీ, డీ ఫోల్డర్ల ద్వారా ప్రతి పంచాయతీలో జరిగే ఆదాయ వ్యయాలను ప్రభుత్వానికి నివేదించాలి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం
పల్లెప్రగతితో ప్రజల్లో వచ్చిన చైతన్యానికితోడు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసింది. గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చే ఆర్థిక సంఘం, తదితర నిధులను నెల నెలా విడుదల చేస్తున్నది. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, టేలర్తోపాటు మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్లను సమకూర్చింది. ప్రతి ఊరిలో రూ.12.50 లక్షలతో వైకుంఠధామాలు నిర్మించింది. రూ. 2.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్స్, డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. మరోవైపు జోరుగా సాగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలతో గ్రామాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
ప్రతి పనిలోనూ గ్రామస్తుల సహకారం
పల్లె ప్రగతి కాన్సెప్ట్ను సరిగ్గా అర్థం చేసుకున్న. ఇందులో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని గుర్తించిన. మొదటిసారి గ్రామసభ పెట్టినప్పుడు కొందరే వచ్చారు. దీంతో మా పాలకవర్గ సభ్యులతో కలిసి వీధుల్లో తిరిగి సమస్యలను, ఎక్కడ ఎలాంటి పనులు అవసరమో గుర్తించాం. సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల సహకారాన్ని కోరాం. ఆ తర్వాత జరిగిన గ్రామసభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి శ్రమదానాల ద్వారా పరిష్కరించుకున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పటి వరకు సమస్యలు లేకుండా చూడగలుగుతున్నాం. తడి పొడి చెత్త సేకరణలో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ట్రాక్టర్ వచ్చినపుడే చెత్తను అందించే అలవాటు చేసుకున్నారు. నా దృష్టిలో ఇది ఎంతో గొప్ప మార్పు.
– మీసాల అంజయ్య, రామకృష్ణాకాలనీ సర్పంచు
మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి
పల్లె ప్రగతితో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. గతానికి ఇప్పటికీ గ్రామాలు చాలా మారిపోయాయి. ప్రభుత్వం నెల నెలా అందిస్తున్న నిధులతో చిన్న చిన్న గ్రామాలు కూడా సమస్యలు పరిష్కరించుకున్నాయి. పల్లె ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. మన ఇల్లు ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో.. వీధిని, గ్రామాన్నీ అలాగే ఉంచుకోవాలనే కాన్సెప్ట్ పల్లె ప్రజల్లోకి వెళ్లిపోయింది. మొదట్లో రోడ్లపై చెత్తా వేస్తే జరిమానా విధించే వాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి దాదాపు ఏ గ్రామంలో ఉండడం లేదు. చెత్తా చెదారం అనేక వీధుల్లో కనిపించకుండా పోయింది. ప్రత్యేక యాప్ ద్వారా మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నాం. సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతోంది.
– వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి, కరీంనగర్