హుజూరాబాద్, అక్టోబర్ 23: హుజూరాబాద్ డివిజన్లో ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఊరికో సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు గ్రామాల్లో పంటకోతలు ప్రారంభం కాగా, దాదాపు 2లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది.
వానకాలం ధాన్యం కొనుగోలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నటి వరకు వర్షాలు వెంటాడడంతో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. తిరిగి వాతావరణం అనుకూలించడంతో హార్వెస్టింగ్ ప్రారంభించారు. డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10శాతం కోతలు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మిట్టపొలాల్లో టైర్ల మిషన్తో వరికోతలు సాగుతుండగా, తడిఆరని పొలాల్లో మాత్రం చైన్ మిషన్లను రైతులు వినియోగిస్తున్నారు. పచ్చి వడ్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో మెజార్టీ రైతులు వాటిని విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఇవే..
హుజూరాబాద్ మండలంలోని మూడు పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి, పెద్దపాపయ్యపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో ధాన్యం సేకరించనున్నారు. జూపాక పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొత్తలపల్లి, కనుకులగిద్దల, శాలపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుమ్మనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నపల్లి, మాందాడిపల్లిలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పలనర్సింగాపూర్, ధర్మరాజుపల్లి, దమ్మక్కపేట, కందుగుల, చిన్నపాపయ్యపల్లి, ఇందిరానగర్, జూపాక, కాట్రపల్లిలో కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో చెల్పూర్, పోతిరెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
దళారుల బెడద తప్పింది
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ధాన్యం సేకరిస్తుండడంతో రైతులకు దళారుల బెడద తప్పింది. ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే వ్యాపారులు, మిల్లర్లు అగ్గువసగ్గువకు అడిగేటోళ్లు. ధాన్యం విక్రయించిన వారం పది రోజుల్లో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. గన్నీ సంచుల కొరత లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
– ఎడవెల్లి కొండల్రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్