విద్యానగర్, అక్టోబర్ 17 : మానవాళి ఆరోగ్యంలో క్రియాశీల పాత్ర పోషించే ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పీ మురళి డిమాండ్ చేశారు. మందులపై కేంద్రం విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలంటూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల ఆరోగ్యానికి కేంద్రం జీడీపీలో రెండు శాతం కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నదని ఆరోపించారు. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ శాతమని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో అనేక ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, దేశ ప్రజలు తమ ఆరోగ్య రక్షణ కోసం ప్రపంచదేశాల కన్నా అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారన్నారు. తమ సంపాదనలో సగానికి పైగా మందుల కొనుగోలు కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ ఫార్మా రంగాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సగానికిపైగా మందుల ధరలు పెంచేందుకు అనుమతించడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని, మందుల ధరలు పెంచడాన్ని అడ్డుకోవాలన్నారు. లేనిపక్షంలో దీర్ఘకాలిక ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ రాజేశం, సహాయ కార్యదర్శి పున్నం రవి, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ విద్యాసాగర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు జి.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు నరేందర్, సీ శివకుమార్, సంపత్రెడ్డి, కే రమేశ్, మెడికల్ రిప్స్ తదితరులు పాల్గొన్నారు.
జీపుజాత
ఫార్మా రంగంలోని ఔషధ ధరలను తగ్గించాలని కోరుతూ తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జీపుజాత ప్రారంభించారు. భగత్ నగర్లో ప్రారంభమై కలెక్టరేట్, గీతాభవన్, కోర్టు ,మంచిర్యాల చౌరస్తా, డాక్టర్ స్ట్రీట్, టవర్ సరిల్ మీదుగా జీపుజాత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.