కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక్కసారిగా తాకిడి పెరిగింది. వచ్చే నెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగుతున్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లోగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే తమకు కలిసి వస్తుందనే ఉద్ధేశంతో చాలా మంది రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. గత రెండు రోజులుగా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కిట కిటలాడుతున్నది. రెండు రోజులుగా క్రయ, విక్రయదారులతో ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అటు తహసీల్ కార్యాలయాల్లో సందులేని పరిస్థితి కనిపిస్తున్నది. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణ రోజుల్లో అయితే ప్రతి రోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు అవుతాయి. కానీ, రెండు రోజులుగా అంతకు మించి అవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 150 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు 120 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇంకా 50కి పైగా డాక్యుమెంట్లు మిగిలి ఉన్నాయని ఈ సమయంలో అధికారులు తెలిపారు. అంటే ఏ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్న కరీంనగర్ రూరల్, గంగాధర, హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రతి కార్యాలయంలో సాధారణ రోజుల్లో కంటే 60 నుంచి 80 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సోమవారం సెలవు ప్రకటిస్తారని భావిస్తున్న క్రయ, విక్రయదారులు శనివారం ఎంత రాత్రయినా తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలనే ఉద్ధేశంతో ఉన్నారు. కాగా, ఫిబ్రవరి ఒకటి నుంచి వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలు 35 శాతం, వ్యవసాయ భూములు 50 శాతం పెరుగుతున్నాయని తెలుస్తున్నది. అర్బన్, రూరల్ కమిటీలు ఇప్పటికే పెరిగిన ధరలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నది. మొత్తానికి మార్కెట్ విలువ పెరుగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాత్రి పొద్దు పోయే వరకు ఉండి ఏ రోజు స్లాట్ బుకింగ్లు ఆ రోజే పూర్తి చేస్తున్నారు.
చాలా మంది చేయించుకుంటున్నారు..
భూముల మార్కెట్ విలువ పెరుగుతుందనే ఉద్దేశంతోనే చాలా మంది రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నరు. మాకు గతంలోనే అగ్రిమెంట్ జరిగింది. రిజిస్ట్రేషన్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు ధరలు పెరిగితే మాకు కొంత భారం తప్పదు. అందుకే ఈ రోజు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వచ్చాం.
ధరలు పెరుగుతున్నాయనే..
వచ్చే నెల నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ రోజు ఎంత రాత్రయినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వచ్చాం. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే కొనేవాళ్లపైనే భారం పడుతుంది. ఇప్పుడు చేయించుకుంటే ఎంతో కొంత కలిసి వస్తుందని అనుకుంటున్నాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాకిడి ఎక్కువ ఉంది. ఏ రాత్రి అయినా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అధికారులు కూడా సహకరిస్తున్నారు..
మూడు రోజుల నుంచి ఇట్లనే ఉంది..
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి. నిన్న ఇవాళ అయితే మరీ ఎక్కువ మంది వచ్చారు. భూముల మార్కెట్ విలువ పెరుగుతున్నయో ఏమో అని చాలా మందిలో సందేహాలు. ఇప్పుడు చేయించుకుంటే కొంత కలిసి వస్తది కదా అని ఈ రోజే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నరు. నేనైతే నిన్న స్లాట్ బుక్ చేసుకుంటే ఈ రోజు అవకాశం వచ్చింది. కామన్ రోజైతే గంటలో రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇవాళ ఇంత రాత్రి వరకు నిలబడాల్సి వచ్చింది.
పొద్దున వచ్చినం..
రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పొద్దున 10 గంటలకల్లా వచ్చినం. ధరలు పెరుగుతున్నయని అందరు ఒక్కసారిగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నరు. మేమూ అంతే. డాక్యుమెంట్ అడ్డగోలు ఉన్నందునా పొద్దునకెల్లి ఇక్కడే ఉంటున్నం. భూముల ధర ఎంత పెరుగుతయో ఎందో తెల్వదాయె. ఇయ్యల్లనే చేయించుకుంటే కొంత కలిసి వస్తది కదా! – ఎండీ మహమూద్ ఖాన్,
మంకమ్మతోట (కరీంనగర్)