కార్పొరేషన్, అక్టోబర్ 4: కరీంనగర్లో పారిశుధ్యం, పరిశుభ్రత విషయంలో నగరపాలక సంస్థ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కరీంనగర్ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు మేయర్ యాదగిరి సునీల్రావు తీసుకుంటున్న చర్యలు నగరాన్ని జాతీయ స్థాయిలో నిలబెడుతున్నాయి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య విభాగంలో ఎప్పటికప్పుడు తీసుకువస్తున్న యాంత్రీకరణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడంతో క్లీన్ సిటీ వైపు అడుగులు వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్లోనూ ప్రతి సంవత్సరం కరీంనగర్ నగరపాలక సంస్థ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నది. గతేడాది 74వ ర్యాంక్ సాధించగా, ఈసారి 67వ ర్యాంక్ సాధించింది. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మిగితా మున్సిపాలిటీలు కూడా తమ స్థానాలను మరింతగా మెరుగుపరుచుకున్నాయి. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో 25 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో జమ్మికుంట జోనల్ స్థాయిలో 24, రాష్ట్ర స్థాయిలో 21 స్థానంలో నిలువగా, హుజూరాబాద్ జోనల్ స్థాయిలో 11, రాష్ట్ర స్థాయిలో 10 స్థానంలో నిలిచింది. అలాగే, 15 వేల నుంచి 25 వేల జనాభా ఉన్న పట్టణాల విభాగంలో చొప్పదండి మున్సిపల్ జోనల్ స్థాయిలో 11, రాష్ట్ర స్థాయిలోనూ 11 స్థానంలో నిలిచింది.
వివిధ అంశాల్లో మెరుగైన ఫలితాలు
కేంద్రం చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఆయా నగరాల్లో అమలు చేస్తున్న 11 అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయించి ర్యాంక్లను ప్రకటిస్తుంది. ఈసారి లక్ష నుంచి 3 లక్షల జనాభాలోపు ఉన్న నగరాల విభాగంలో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో కరీంనగర్ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో 67వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల తర్వాత కరీంనగర్ ముందంజలో ఉంది. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్లో ఇంటింటా చెత్త సేకరణ, రోడ్ల పరిశుభ్రత, పబ్లిక్ టాయ్లెట్స్ పరిశుభ్రత, నగర సుందరీకరణ, మార్కెట్లు, నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత, మురుగు కాల్వల పరిశుభ్రత, నీటి ప్రాంతాలు, ప్రతి రోజు స్వీపింగ్, డంపర్ బిన్స్ పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంక్లను కేటాయిస్తున్నారు. ఇందులో రోడ్లు, పబ్లిక్ టాయ్లెట్స్ పరిశుభ్రతలో 75 నుంచి 90 శాతం మార్కులు సాధించగా, మిగితా అంశాల్లో 90 శాతానికి మించి కరీంనగర్ నగరపాలక సంస్థ మార్కులు సాధించడం గమనార్హం. ఈ అంశాల్లో గతేడాది కంటే ఈసారి అనేక సంస్కరణలు తీసుకోవడంతో పాటు స్మార్ట్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులతో నగరం రూపురేఖలు మారడంతో పాటు సుందరీకరణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రధాన చౌరస్తాల ఐలాండ్స్ను మరింత సుందరీకరణ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగుకుపైగా చౌరస్తాలను సుందరీకరణ చేయగా… మరో 6 చౌరస్తాల సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
పారిశుధ్య పనులకు యాంత్రీకరణ
నగరపాలక సంస్థలో పారిశుధ్య విభాగంలో యాంత్రీకరణ దిశగా పాలకవర్గం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే నగరంలోని రోడ్లను శుభ్రం చేసేందుకు రెండు భారీ, మరో రెండు చిన్న స్వీపింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితో పాటు డివిజన్లలో సుమారు వెయ్యి మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దోమల నివారణకు డివిజన్కొక హ్యాండ్ ఫాగింగ్ యంత్రం, మరో ఆరు పెద్ద ఫాగింగ్ యంత్రాలను వినియోగిస్తున్నారు. అలాగే, నగరంలోని సైడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా చేపడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా జెట్టీ వాహనాలను వినియోగిస్తున్నారు. నగరంలోని అన్ని రోడ్లను స్వీపింగ్ చేసేందుకు యంత్రాలను వినియోగించడంతో పాటు డివిజన్లలోని అంతర్గత రోడ్లను కార్మికులతో శుభ్రం చేయిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో..
గతేడాది కేంద్రం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో నగరపాలక సంస్థకు 74వ ర్యాంక్ వచ్చింది. ఈసారి పారిశుధ్యం, సుందరీకరణ విషయంలో తీసుకున్న చర్యలు, ప్రజల భాగస్వామ్యంతో 67వ స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా ఈసారి పారిశుధ్య విభాగం సిబ్బంది ప్రత్యేకంగా ప్రతి ఇంటి నుంచి ప్రజల భాగస్వామ్యం ఉండేలా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలపై స్వచ్ఛ సర్వేక్షణ్లో అభిప్రాయాలను పొందుపర్చే విధంగా ప్రచారం చేపట్టారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో ఆయా స్థాయిలో మంచి మార్కులు వచ్చేందుకు దోహదపడిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతోనే మంచి ర్యాంక్
నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నం. వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 20లోపు వచ్చేందుకు కృషి చేస్తం. ఇప్పటికే నగరంలోని రోడ్లు, చౌరస్తాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నం. వీటితో పాటు ప్రజలకు అవసరం మేరకు పబ్లిక్ టాయ్లెట్స్, ఓపెన్ జిమ్స్, వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేసి, పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నం. పాలకవర్గ సభ్యులు, అధికారులు, నగరవాసుల సహకారంతోనే మెరుగైన ర్యాంక్ సాధించాం.
– వై సునీల్రావు, మేయర్