హుజూరాబాద్ టౌన్, జూలై 19 : ప్రభుత్వం 1993లో హుజూరాబాద్లో డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. 1994లో మొదటి బ్యాచ్ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలుత పట్టణ సమీపంలోని కేసీ క్యాంపులో ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీకి చెందిన ఓ భవనాన్ని కేటాయించి అదే ఏడాది తరగతులు కూడా ప్రారంభించారు. ఈ కళాశాల పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఆశించినమేర అడ్మిషన్లు జరగలేదు. దాంతో కాలేజీని పట్టణానికి మార్చాలంటూ విద్యార్థులతో పాటు, స్థానిక నాయకులు విన్నవించారు. వీరి కోరిక మేరకు 2018-19లో హుజూరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్పించారు. తాత్కాలికంగా కొన్ని నెలలు జూనియర్ కళాశాల భవనంలోని కొన్ని గదులు కేటాయించడంతో తరగతులు కొనసాగించారు.
అన్ని హంగులతో నిర్మాణం
డిగ్రీ కాలేజీ కోసం జూనియర్ కళాశాలలోని కొంత స్థలంతోపాటు పకనే ఉన్న సర్కారు భూమిలో మరికొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కోట్ల నిధులు ఇవ్వగా, ఆధునిక హంగులతో భవనం నిర్మాణమైంది. రెండు అంతస్తుల్లో ఎనిమిది గదులు నిర్మించారు. గదుల్లో ఫర్నిచర్తోపాటు అధునాతన ల్యాబ్, ఎనిమిది వేల పుస్తకాలతో లైబ్రరీ, విశాలమైన ఆటస్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ యేడాది నుంచే అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉన్నత విద్యను బోధిస్తున్నారు. ఇక్కడ ఎస్ఎస్ఎస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
కళాశాలలోని కోర్సుల వివరాలు..
డిగ్రీ కాలేజీలో బీఏ(కంప్యూటర్ అప్లికేషన్స్), బీకాం (కంప్యూటర్స్), బీఎస్సీ ఫిజికల్ సైన్స్ (మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ లైఫ్ సైన్స్ (బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రూపులో 60 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సారి ఈడబ్య్లూఎస్ కోటాను అమలు చేస్తున్నారు.
ఒకటో తేదీ నుంచే అడ్మిషన్ల ప్రక్రియ
దోస్త్ అడ్మిషన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలైంది. మొదటి దశ రిజిస్ట్రేషన్ జూలై 30 వరకు, రెండో నెల రిజిస్ట్రేషన్ ఆగస్టు 21వ తేదీ వరకు, మూడో దఫా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 12 వరకు జరుగుతాయి.
గతేడాది నుంచి పెరిగిన అడ్మిషన్లు
1998-99 అకడమిక్ ఇయర్లో హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మొత్తం 147 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించారు. కేసీ క్యాంపు నుంచి హుజూరాబాద్ పట్టణానికి కళాశాలను మార్చడంతో ఆదరణ పెరిగింది. 2021-22 అకడమిక్ ఇయర్లో 301 మంది అడ్మిషన్లు పొందారు. ఇందులో బీఎస్సీ, ఫిజికల్ సైన్స్ 40 మంది, బీఎస్సీ లైఫ్ సైన్స్లో 58, బీఏ, బీకాం కంప్యూటర్స్లో 94, బీఏ కంప్యూటర్స్లో 109 మంది అడ్మిషన్లు పొందారు. ఈసారి 2022-23లో గతంలోకన్నా విద్యార్థుల అడ్మిషన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కళాశాల అధ్యాపకుల ద్వారా తెలుస్తున్నది.
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది
విద్యార్థులు గతంలో ఎక్కువగా ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు డిగ్రీతో కూడా ఉద్యోగావకాశాలు ఎకువగా ఉండడంతో డిగ్రీలో చేరుతున్నారు. విద్యార్థులకు అనువుగా కొత్త భవన నిర్మాణం కావడంతోపాటు ఉపయోగకరంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అన్ని హంగులతో కళాశాలను కొనసాగిస్తున్నాం. దోస్త్ అడ్మిషన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు నెలల పాటు కొనసాగుతున్నది. విద్యార్థులు ఈ కళాశాలను ఎంపిక చేసుకొని తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.
– గొడిశాల పరమేశ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ (హుజూరాబాద్)