కమాన్ చౌరస్తా, జూలై 19 : కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సుతో అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయని, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న క్రమంలో నాన్ అకాడమిక్ కోర్సుగా దీన్ని ఎంచుకుని ఉన్నత స్థాయికి ఎదుగవచ్చని ఐసీఎస్ఈ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజ మొగిలి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిమ్స్ కళాశాల, శాతవాహన యూనివర్సిటీ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించిన సదస్సులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్, డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులతోపాటు ఉత్తీర్ణులు రెండున్నరేండ్లలోనే కోర్సు పూర్తి చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి కంపెనీ సీఎస్ను నియమించుకోవాల్సి ఉంటుందన్నారు.
దేశవ్యాప్తంగా 2.5 లక్షల కంపెనీలు ఉంటే, కేవలం సీఎస్ పూర్తి చేసిన వారు 65 వేల మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒకరికీ పారిశ్రామిక రంగంలో ప్రారంభంలోనే నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వేర్వేరుగా జరిగిన ఈ సదస్సుల్లో ఐసీఎస్ఐ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్యూ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డీ హరికాంత్, బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్ ఈ మనోహర్, సాయిలు, కృష్ణకుమార్, తిరుపతి, అనూష, నరేశ్, కిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ అర్జున్రావు, అనూష్రెడ్డి, రాజ్కుమార్, తిరుపతి, నరేశ్, నాగరాజు, సంపత్కుమార్, సంధ్యారాణి, పల్లవి, తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : వీసీ
శాతవాహన యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించిన వీసీ, ప్రొఫెసర్ మల్లేశ్ కంపెనీ సెక్రటరీ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో రాణించాలని, చదువుతోపాటు ఇతర అంశాలపైనా అవగాహన ఉండాలని సూచించారు.
అవగాహన కోసమే కార్యక్రమాలు : కిమ్స్ వైస్ చైర్మన్
కిమ్స్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో వైస్ చైర్మన్ రామారావు మాట్లాడుతూ ప్రారిశ్రామిక రంగంలో అత్యున్నతమైన హోదాగల ఉద్యోగం కంపెనీ సెక్రటరీతోనే సాధ్యమన్నారు. ఒక సంస్థ ఉన్నత మార్గంలో నడవాలంటే ఆ సంస్థ సెక్రటరీపైనే ఆధారడి ఉంటుందన్నారు. అలాంటి కోర్సులను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కొత్త విషయాలు తెలిశాయి
డిగ్రీ, పీజీ తర్వాత ఇలాంటి కోర్సులు ఉంటాయని తెలియదు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో చాలా విషయాలు తెలిశాయి. కంపెనీ సెక్రటరీ కోర్సుతో ఉద్యోగావశాలు ఉంటాయని తెలిశాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటాం.
– పరమేశ్, ఎంకాం విద్యార్థి (ఎస్యూ)
చదువు పూర్తికాగానే ఉద్యోగం
కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తికాగానే ఉద్యోగం వస్తుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి కోర్సులు ఉంటాయని నాతో పాటు చాలా మందికి తెలియదు. ఇలా తెలిసేలా కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. పీజీ చేస్తూనే ఈ కోర్సు చేయాలనే ఆలోచన మొదలైంది.
– అచ్యుత, ఎంబీఏ విద్యార్థిని (ఎస్యూ)