బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుకుతుండడంతో మితిమీరిన వేగంతో ట్రాక్టర్లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో పలువురి ప్రాణాలు గాల్లో కలుస్తుండగా మరెందరో క్షతగాత్రులుగా మారుతున్నారు. తాజాగా, ఈటల అనుచరుడికి చెందిన ఇసుక ట్రాక్టర్ అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొన్న ఘటనలో వీణవంక మండలం దేశాయిపల్లిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.
వీణవంక, అక్టోబర్ 16 : బీజేపీ నేత ఈటల అనుచరులు ఆయన అండ చూసుకుని ఇసుక అక్రమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. కొందరు సర్పంచులు వత్తాసు పలుకుతుండడంతో నిత్యం వందలాది ట్రాక్టర్లలో మితిమీరిన వేగంతో తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా, ఆదివారం ఓ ట్రాక్టర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో పొలం వద్దకు వెళ్తున్న రైతు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం దేశాయిపల్లికి చెందిన కాంపెల్లి కొమురయ్య (59) నిరుపేద రైతు. 40 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వలస వెళ్లాడు. రెండేండ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి తనకున్న ఎకరన్నర పొలాన్ని సాగుచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో మల్లారెడ్డిపల్లికి చెందిన బీజేపీ కార్యకర్త కొలిపాక ప్రశాంత్ మానేరువాగు నుంచి ట్రాక్టర్లో ఇసుకను నింపుకొని దేశాయిపల్లి వైపు అతివేగంగా వస్తూ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న కొమురయ్య బైక్ను ఢీకొట్టాడు. ట్రాక్టర్ డబ్బా తలకు బలంగా తగలడంతో కొమురయ్య అక్కడికక్కడే కుప్పకూలాడు. వెనుకాల కూర్చున్న మహిళ వసంతకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ నడుపుతున్న ప్రశాంత్ పారిపోగా, గమనించిన దేశాయిపల్లి గ్రామస్తులు వెంటనే ‘108’కి సమాచారం అందించి, జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొమురయ్య మరణవార్త విని భార్య పోచవ్వ, కొడుకు, ఇద్దరు బిడ్డలు బోరుమన్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని హృదయవిదారకంగా రోదించిన తీరు పలువురిని కలిచివేసింది.
బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, ధర్నా..
అతివేగంతో వచ్చి అన్యాయంగా ప్రాణాలు పొట్టనబెట్టుకున్న బీజేపీ కార్యకర్త ప్రశాంత్ను కఠినంగా శిక్షించాలని మృతుడు కాంపెల్లి కొమురయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దేశాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద జమ్మికుంట-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా న్యా యం చేయాలంటూ రోడ్డుపై సుమారు 6 గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నా విరమించే ప్రయత్నం చేయగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ప్రమాద కారకుడిపై కేసు..
ఇసుక ట్రాక్టర్ను అజాగ్రత్తగా, వేగంగా నడిపి రైతును బలిగొన్న ప్రశాంత్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. కొమురయ్య కొడుకు రాజు ఫిర్యాదు మేరకు కేసును రిజిస్టర్ చేశామని చెప్పారు. కాగా, అంతకుముందు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదతీరును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ట్రాక్టర్ను ఠాణాకు తరలిస్తుండగా యువకులు అడ్డుకున్నారు. టైర్లలో గాలితీసి, చాకులతో కోసివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.