కమాన్చౌరస్తా, అక్టోబర్ 5: జిల్లాలో దసరా సంబురాలు బుధవారం అట్టహాసంగా సాగాయి. ఆలయాలు, దుర్గామాత మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. శమీ పూజల అనంతరం భక్తులు ఇండ్లకు చేరుకొని, బంగారం (శమీ ఆకు) పెద్దలకు, స్నేహితులకు ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలను మేయర్ వై సునీల్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దసరా వేడుకలు, క్రాకర్స్ షో అలరించాయి. గోగుల ఈవెంట్స్ నిర్వాహకుడు, తెలంగాణ ఈవెంట్స్ ఇండస్ట్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగుల ప్రసాద్, శ్రావణభార్గవి, చిలువేరు శ్రీకాంత్, గోగుల ప్రసాద్ పాడిన పాటలు, హీరో సంపూర్ణేష్ బాబు, కమెడియన్లు రాజమౌళి, ఇమ్మానియల్, నవీన్, ఆర్ఎస్ నంద, క్లాసికల్ డ్యాన్సర్ డాక్టర్ వైష్ణవి, జానపద నృత్య కళాకారిణి జానులిరి, గిన్నీస్ వరల్డ్ రికార్డర్ జుగెలర్ కిషన్ (బాంబె), డ్యాన్సర్ కిరణ్, తెలంగాణ పేరిణి నృత్య కళాకారుడు రంజిత్ కుమార్, జిల్లాకు చెందిన సంగెం రాధాకృష్ణ బృందం, మిమిక్రీ ఆర్టిస్టు వై రాజు ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమానికి వరజ వ్యాఖ్యానం ఎంతో ఆకట్టుకుంది. అనంతరం రాంలీలా, క్రాకర్షో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఆలయాల్లో..
నగరంలోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో దసరా ఉత్సవాలు, దుర్గా మాత, శమీ పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం మహాగణపతికి అభిషేకాలు చేశారు. అర్చనలు విశేష పుష్పాలంకరణ, నీరాజన మహాపూజలు, వాహన పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన శమీపూజ, రాంలీలా కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్ రావు, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, సీపీ సత్యనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రూరల్ ఏసీపీ విజయసారథి, కార్పొరేటర్ మర్రి భావనాసతీశ్, ఈవో ఎండపెల్లి మారుతి, అర్చకుడు రామక శంకరశర్మ, గుడికాడి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, ఆలయంలో ఏర్పాట్లను ఆలయ మాజీ చైర్మన్ కలర్ సత్తన్న ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
గిద్దెపెరుమాండ్ల దేవస్థానంలో జరిగిన రాంలీలా కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో జరిగిన పూజల్లో ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. వావిలాలపల్లిలోని హనుమాన్ సహిత కనకదుర్గ ఆలయంలో జరిగిన శమీపూజలో కార్పొరేటర్ బండారి వేణు, స్థానికులు పాల్గొన్నారు. పంచముఖ హనుమాన్ ఆలయంలో పరబ్రహ్మానందగిరి స్వామి నేతృత్వంలో శమీ, ఆయుధ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో వీహెచ్పీ, భజరంగ్దళ్ నాయకులు ఊటూరి రాధాకృష్ణారెడ్డి, బుస్స శ్రీనివాస్, డాక్టర్ ఐ రవీందర్, ధర్మప్రసాద్, విఠలాచారి, ప్రదీప్ రాజేందర్, శ్రీకాంత్, చారి, ప్రవీణ్ పాల్గొన్నారు. పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో శమీ పూజ నిర్వహించగా, సంఘం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. అలాగే, రాంనగర్లోని మార్క్ఫెడ్ మైదానంలో నిర్వహించిన రాంలీలా కార్యక్రమాన్ని కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ప్రారంభించగా, జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎల్ఎండీలో దసరా ధూం ధాం
తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్5: మండలంలోని ఎల్ ఎండీ కాలనీలో గల రాంలీలా మైదానంలో ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో దసరా ధూం ధాం వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో జానపద కళాకారులు, హాస్య నటుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. అనంతరం రావణ దహనం చేశారు.