పూల జాతర మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎంగిలిపూల సంబురాలు అంబరాన్నంటాయి. ముంగిళ్లన్నీ పూలసంద్రాలయ్యాయి. వీధులన్నీ పాటలతో మార్మోగాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి కూడళ్లలో ఉంచి చిన్నాపెద్దా కలిసి పాటలతో హోరెత్తించారు. చుట్టూ తిరుగుతూ కోలాటమాడుతూ నృత్యాలు చేశారు. రామరామ రామ ఉయ్యాలో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సందడి చేశారు. అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. పలువురు మహిళలు సర్కారు అందించిన చీరలను కట్టుకొని బతుకమ్మ ఆడారు.
కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 25: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరూవాడా సందడిగా మారాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి కూడళ్లలో ఉంచి చిన్నాపెద్దా కలిసి ఆడిపాడారు. చుట్టూ తిరుగుతూ కోలాటమాడుతూ నృత్యం చేశారు. ‘రామరామ ఉయ్యాలో’.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’.. పాటలతో వీధులన్నీ మార్మోగగా అనంతరం చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. కరీంనగర్లో జడ్పీ సీఈవో ప్రియాంక పలు చోట్ల బతుకమ్మ ఆడారు. సిరిసిల్లలోని మానేరుతీరంలోని బతుకమ్మ ఘాట్ వద్ద, వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత, మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ పాల్గొన్నారు. పలు గ్రామాల్లో మహిళలు సర్కారు అందజేసిన చీరలు ధరించి సంబురంగా బతుకమ్మ ఆడారు.