కరీంనగర్ : టీఆర్ఎస్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని-వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన యువత టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
ఈటెల హయాంలో ఆయనే బాగుపడ్డాడు తప్పా.. నియోజకవర్గానికి ఏం చేయలేదని మండిపడ్డారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల నియోజకవర్గం కేంద్రంలో బస్టాండ్ కూడా బాగుచేసుకోలేదని విమర్శించారు. హుజురాబాద్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ సూచించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతోపాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.