ప్రాథమిక దశలోనే విద్యార్థుల భవితకు పటిష్ట పునాది వేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కరోనా మహమ్మారితో సన్నగిల్లిన అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు ఆగస్టు 15న శ్రీకారం చుట్టిన ‘తొలిమెట్టు’ను రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతం చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికతో ముందుకుసాగుపోతున్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థుల్లో చదవడం, రాయడంతోపాటు నాలుగు సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా కృషి చేస్తున్నది. చిన్నారుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు స్టూడెంట్ ట్రాకర్ యాప్లో నమోదు చేస్తున్నది. మూడు నెలల కాలంలో జరిగిన బోధన అంశాలపై సత్ఫలితాలు రావడంతో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది.
– రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17(నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో విద్యాప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ప్రణాళికతో ఉత్తమ బోధన అందించారు. అనంతరం మూడు నెలల విద్యార్థుల ప్రగతిపై స్థాయి పరీక్షలు నిర్వహించారు. అందులో కొంత మెరుగు కనపడడంతో మరింత ఉత్సాహంతో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తున్నారు.
తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు తీరును పరిశీలించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మండలానికో నోడల్ అధికారిగా (ఎఫ్ఎల్ఎన్) నియమించింది. ఎంఈవోలు, జిల్లా స్థాయి, మండల స్థాయి క్లస్టర్ కోఆర్టినేటర్లంతా కలిసి క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షించి విద్యార్థుల సామర్థ్య స్థాయిని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తున్నారు. జిల్లా అధికారుల తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్ర స్థాయి అబ్జర్వర్లు నెలకోసారి జిల్లాలోని ఒక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల ప్రతిభను పరిశీలిస్తారు.
స్థాయి పరిశీలనకు స్టూటెండ్ ట్రాకర్ యాప్
‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నది. శతశాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నది. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో విద్యాశాఖ జిల్లాధికారి రాధాకిషన్, ప్రత్యేక అధికారి శైలజ పర్యవేక్షణలో వివిధ కమిటీలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల స్థాయిని ఎప్పకప్పుడు పరిశీలిస్తున్నాయి. విద్యార్థుల స్థాయిని ఎప్పటికప్పుడు నమోదు చేసేలా స్టూడెంట్ ట్రాక్ యాప్ను ఏర్పాటు చేసింది. ఇందులో జిల్లాలోని 13 మండలాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మొత్తం 394 ఉండగా, అందులో 22,196 మంది విద్యార్థులున్నారు. 336 ప్రాథమిక పాఠశాలలుండగా, 19,033 మంది విద్యార్థులున్నారు. అందులో బాలురు 9681, బాలికలు 9352 మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 38 కాగా మొత్తం విద్యార్థులు 3,163, అందులో బాలురు 1,693, బాలికలు 1470 ఉన్నారు. వీరందరి అభ్యసనా స్థాయిని తెలుసుకునేలా స్టూడెంట్ యాప్ను రూపొందించారు. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. పాఠశాలల విద్యార్థుల ప్రతిభను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు స్టూడెంట్ యాప్లో నమోదు చేస్తారు. ఆ వివరాలను మానిటరింగ్ అధికారులు టాంజరిన్ అనే యాప్లో నమోదు చేస్తారు. అందులో అన్ని పాఠశాలలకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
నాలుగు సబ్జెక్టులపై పట్టు సాధించేలా..
ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో అభ్యసనా స్థాయి పెంపునకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం నాలుగు సబ్జెక్టులలో పట్టు సాధించేలా విద్యార్థులకు బోధన చేస్తున్నది. ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ఈ కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థుల్లో అభ్యసన స్థాయి సామర్థ్యం మెరుగు పడుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. మూడు నెలల కాలంలో జరిగిన బోధన అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన స్థాయి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కనిపించడంతో కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నది. ఆట, పాటలతో విద్యార్థుల్లో స్థాయి సామర్థ్యం పెంచి ‘తొలిమెట్టు’ కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థాయిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారితో పిల్లలు పూర్తిస్థాయిలో అభ్యసన ఫలితాలు సాధించడంలో వెనుకబడి పోయారు. మౌలిక, భాషా, గణిత సామర్థ్యాల సాధన కోసం ప్రవేశపెట్టిన తొలిమెట్టుతో 220 రోజుల్లో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ కోసం ప్రణాళికను రూపొందించారు.
చాలా మంచి కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు పేరిట చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. పీరియడ్ ప్లాన్తో ఉపాధ్యాయులకు కొంత ఇబ్బందిగా ఉన్నా, కార్యక్రమం అమలుకోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను ముందు వరసలో నిలిపేందుకు ఉపాధ్యాయులమంతా కలిసి ప్రయత్నం చేస్తున్నాం. – నీటి శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ప్రణాళికాబద్ధంగా ముందుకు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానంలో పట్టు సాధించేలా బోధన చేపట్టి, వారి ప్రగతి వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేస్తున్నాం. కార్యక్రమం అమలు తీరుపై అధికారులంతా కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తున్నారు. మూడు నెలల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలపై నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయి. విద్యార్థుల ప్రగతిపై స్టూడెంట్ ట్రాకర్ యాప్లో చూసుకోవచ్చు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది.
– డాక్టర్ రాధాకిషన్, డీఈవో (రాజన్న సిరిసిల్ల)
తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన 20 అంశాలను విద్యాశాఖ సూచించింది.
పిల్లలకు బేస్లైన్ టెస్టులు నిర్వహించాలి