కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కరీంనగర్ కలెక్టర్ కె. శశాంకా ఆదేశించారు. పలు శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూనెలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు, ఇతర ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకోకుండా చూడాలన్నారు. అధికారులు తరచుగా హోల్సేల్ మార్కెట్లను సందర్శించడం ద్వారా ధరలను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా దుకాణాల వద్ద వస్తువుల రేట్లు ప్రదర్శించేలా చూడాలన్నారు.
నిత్యావసర వస్తువులను సరఫరా చేసే వాహనాల కదలికపై ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. ఏదైనా వాహనాన్ని ఆపితే అధికారులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో మాట్లాడి వాహనం విడుదలయ్యేలా చూడాలన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా వాహనాలను ఆపొద్దని డీసీపీకి సూచించారు. మార్కెట్లలో తగినంత కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరలను నియంత్రించడం అధికారుల కర్తవ్యం అన్నారు. ఎవరైనా వస్తువుల రేట్లు పెంచే ప్రయత్నం చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.