కరీంనగర్ : ‘దళితబంధు’ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం, కుట్రలు, కుతంత్రాలను సీఎం కేసీఆర్ రేపు సభా వేదికగా పటాపంచలు చేస్తారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితబంధులాంటి గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. మహత్తరమైన ఈ పథకాన్ని హూజూరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకం అమలుపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. విధివిధానాలపై సభలో ముఖ్యమంత్రి మరింత స్పష్టత ఇస్తారన్నారని ఆయన వెల్లడించారు.
సభలో 15మంది కుటుంబాలకు చెక్కులిస్తామని, లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకుంటారని చెప్పారు. ఈ నెల 17 నుంచే నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ. 10లక్షల చొప్పున అందుతాయని తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆనాదిగా ఎన్నో బాధలు అనుభవిస్తున్న దళితుల జీవితాలలో వినూత్న మార్పు తెచ్చే ఉద్దేశంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని వివరించారు.
దేశమంతా తెలంగాణ వైపు చూస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతుంటే ఇక్కడి ప్రతిపక్షాలు అడ్డు పుల్లలు వేయడం సరికాదన్నారు. ఆగస్టు 16వ తేదీ దళితజాతి మర్చిపోలేని గొప్ప రోజని, చరిత్రలో నిలిచిపోయే దినమని అభివర్ణించారు. సభలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ పాల్గొంటారన్నారు. సభకు సుమారు లక్షా 20వేల మంది హాజరవుతారని, ఇందులో ఎక్కువగా దళితులే ఉంటారన్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ఒంటి గంటకు సభా ప్రాంగణానికి చేరుకుంటారని, పథకాన్ని ప్రారంభించి, ప్రజలనుద్దేశించి మాట్లాడి సాయంత్రం 4గంటలకు బయలు దేరుతారని వివరించారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్,రైతు సమన్వయ సమితి చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.