జగిత్యాల, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటివరకు 65 ఏండ్లు నిండిన వృద్ధులకు మాత్రమే ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 57 ఏండ్లకు ఈ నిబంధనలను కుదిస్త్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 57 ఏండ్లు ఉండి అర్హులైన వారిని ఎంపిక చేసే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపట్టింది. అప్పట్లోనే ఈ జాబితాను సిద్ధం చేసిన అధికారులు తాజా ఆదేశాలతో కసరత్తు చేస్తున్నారు. ఓటరు జాబితా ఆధారంగా కొత్త పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇప్పటికే 65ఏండ్లున్న వారికి పింఛన్లు అందుతుండగా 57 ఏండ్ల నుంచి 64 వరకు ఉన్నవారు కొత్త పింఛన్లు అందుకోనున్నారు. వీరు ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 70,395 మంది ఉండగా, కరీంనగర్లో 14,494 మంది, జగిత్యాలలో 25,047, పెద్దపల్లిలో 16,746, రాజన్న సిరిసిల్లలో 14,108 మంది ఉన్నారు.
సీఎంకు రుణపడి ఉంటం
57 ఏండ్లు నిండిన వాళ్లందరికీ త్వరలోనే పింఛన్ ఇవ్వనుండడం సంతోషంగా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే పింఛన్లు పది రెట్లు పెరిగినయ్. ఇప్పుడు నాకు 57 ఏండ్లు నిండినయ్. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. నాక్కూడా ఇప్పుడు పింఛన్ అస్తది.
ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ప్రకటనతో 57 ఏళ్లకు పైబడిన వారి జాబితాను వేగంగా సిద్ధం చేస్తున్నాం. అర్హులకు పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తాం. తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.