ఒక్క రోజూ విశ్రమించని టీచర్లు
కరోనా నియంత్రణలో భాగస్వామ్యం
తమ పరిధిలో ప్రజలకు అవగాహన
జ్వర సర్వేలో కీలక బాధ్యతలు
టీకా కేంద్రాల్లోనూ విధులు
ఇంటింటికీ వెళ్లి సరుకులు పంపిణీ
కొవిడ్ బాధితులకు ధైర్యం చెపుతూ భరోసా
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా విపత్కర పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో బహుళ సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలస్తున్నారు. ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా బాధ్యతగా పని చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూనే ఫీవర్ సర్వేలో నిమగ్నమవుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ పేర్లు నమోదు, రికార్డుల నిర్వహణ వంటి పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తూ వారి మంచి చెడులు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. ఎక్కడ చూసినా కరోనా నియంత్రణ చర్యల్లో చురుగ్గా భాగస్వాములవుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాష్ట్ర సర్కారు సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాలు పెంచి, హోదా మార్చడంతో సంతోషంగా విధులను నిర్వర్తిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా వణికిస్తోంది. అనేక మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి అంగన్వాడీలు అండగా నిలుస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విస్తృత సేవలు అందిస్తున్నారు. ఒక్క రోజు కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. అనేక మంది సహచరులు కరోనా బారిన పడినా వెరవకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులుగా ఉన్న గర్భిణులు, బాలింతలు 7 నెలల నుంచి 6 ఏండ్ల పిల్లల వరకు ఒక్కరిని విస్మరించకుండా పౌష్టికాహారం అందిస్తున్నారు. తమ లబ్ధిదారుల్లో కరోనా బాధితులు ఉంటే ఇండ్లకువెళ్లి మరీ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నెత్తిన సరుకులు ఎత్తుకుని ఇంటింటికీ తిరుగుతూ అందిస్తుంటే వారిని అభినందించని వారు లేరు. గర్భిణులను గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకుని నివేదికలు అందిస్తున్నారు. ఇండ్లలో ఉండే చిన్నారుల వద్దకు వెళ్లి వారి ఆక్టివిటీస్ను పరిశీలిస్తున్నారు. సాధారణ ఆరోగ్యంతో ఉన్న పిల్లలకు రోజుకు గంట తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి పిల్లలను అక్కున చేర్చుకుంటూ వారి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.
కరోనా నివారణలో కీలకం
మరో పక్క కరోనా ఉధృతిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో అంగన్వాడీలు చురుగ్గా పాల్గొంటున్నారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లు అందిస్తున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లాక్డౌన్లో బయటకు వెళ్లవద్దని ఇంటింటికీ వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కరోనా రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇటు జ్వర సర్వేలో పాల్గొంటూనే వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కూడా విధులు నిర్వహిస్తూ వైద్య సిబ్బందికి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా అంగన్వాడీలు, వారి సహాయకులు ప్రజలకు అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
బహుళ విధులతో ఆదర్శం
గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ప్రస్తుతం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలను గత ప్రభుత్వాలు కొంత చిన్నచూపు చూశాయి. రూ.30ల వేతనాలతో అంగన్వాడీ వ్యవస్థ ప్రారంభం కాగా, కాలక్రమంలో కొంత పెరుగుతూ వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, మూడేళ్ల లోపున్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం, మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను బోధించడం లక్ష్యంగా పెట్టారు. కాలక్రమంలో ఈ విధులతోపాటు అదనపు విధులను సైతం అంగన్వాడీలకు అప్పగిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించడం, అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో బూత్ లెవల్ అధికారులుగా పనిచేయడం, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, తదితర ప్రక్రియలన్నింటినీ అంగన్వాడీలే నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి సమస్యలు వినడమే గాక, వారితో భోజనం చేసి వారిలో నమ్మకాన్ని కల్పించారు. అంగన్వాడీ కార్యకర్త పేరు తీసేసి అంగన్వాడీ టీచర్ హోదా కల్పించారు. అలాగే, వారికి రూ.4,500లుగా ఉన్న వేతనాన్ని రూ.10,500లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్వాడీ టీచర్లతో పాటు, ఆయాలకు సైతం వేతనాలను ఆరువేలకు పెంచారు. దీంతో అంగన్వాడీ టీచర్ పోస్టుకు ప్రాధాన్యత పెరిగిపోయింది.
ప్రభుత్వానికి మద్దతుగా ఉండడం మా బాధ్యత..
మాకు మేలు చేసిన సీఎం కేసీఆర్కు మేం రుణపడి ఉంటాం. మాకు టీచర్ హోదా గౌరవంతో పాటు, వేతనం సైతం మంచిగానే ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం చాలా మేలు చేసింది. కరోనా కష్ట సమయంలో ప్రజలకు, ప్రభుత్వానికి మద్దతు తెలుపడం మా నైతిక బాధ్యత.