40 లక్షలతో వేములవాడలో ఏర్పాటు
ఏరియా దవాఖానలో 15రోజుల్లో పూర్తిస్థాయి సేవలు
సిరిసిల్ల జిల్లావాసులకు అందుబాటులో 500 పడకలు
జిల్లాలో లక్షా 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి
జ్వర సర్వేలో భాగంగా 3,900 మందికి మెడికల్ కిట్లు
త్వరలోనే సిరిసిల్ల వైద్యశాలలో హెచ్ఆర్సీటీ సేవలు
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
తిప్పాపూర్లో వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవం
వేములవాడ, సిరిసిల్లలో చిన్నారుల కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు ఆదేశం
పనులు వేగంగా పూర్తి చేయించిన కలెక్టర్, డీఎంహెచ్వోకు అభినందనలు
వేములవాడ, మే28:కరోనా తీవ్రత మళ్లీ పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ చికిత్సకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని, వేములవాడలో 40 లక్షలతో పదిరోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిప్పాపూర్లో నిర్మించిన వంద పడకల ఏరియా దవాఖానను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వేములవాడ దవాఖాన ప్రారంభంతో జిల్లాలో 500 పడకలు అందుబాటులోకి వచ్చాయని, ఇక్కడ 50 పడకలతో ప్రత్యేక కొవిడ్ వార్డును సిద్ధం చేశామని చెప్పారు. మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారని, వేములవాడ పాత పీహెచ్సీలో 50 పడకలు, సిరిసిల్లలో 50 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న నిరంతర సేవలు చిరస్థాయిలో నిలుస్తాయని కొనియాడారు.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వేములవాడలో పది రోజుల్లో 40లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. వైరస్ను ఎదుర్కొనేందుకు విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న నిరంతర సేవలు చిరస్థాయిలో నిలిచిపోవడమే కాకుండా ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుంటారని తెలిపా రు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో 22 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దవాఖానలో కలియతిరిగారు. ప్రత్యేక కొవిడ్ వార్డుతోపాటు అందుబాటులో ఉన్న సేవలన్నింటినీ పరిశీలించారు. ప్రత్యేక గదులు, అందుతున్న సేవలు, సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్స్థాయి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరిన వెంటనే దవాఖానను మంజూరు చేశారని గుర్తు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆలస్యమైనా తుదిదశ పనులను పూర్తి చేసేందుకు నెలరోజులుగా శ్రమించిన జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, వైద్యాధికారి మహేశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వేములవాడ దవాఖానతో కలిపి ఇక జిల్లాలో 500 పడకల స్థాయికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేములవాడ దవాఖానలో 50 పడకలతో ప్రత్యేక కొవిడ్ వార్డును సిద్ధం చేశామని పేర్కొన్నారు. అన్ని రకాల వైద్య సేవలతోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని చెప్పారు. సిరిసిల్ల తరహాలో వేములవాడ దవాఖానలోనూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్యులు, 70మంది సిబ్బందితో సేవలు అందుతాయని వివరించారు. ఆరోగ్య సర్వేలో భాగంగా జిల్లాలో 3,900 మందిని గుర్తించి కిట్లను అందజేశామన్నారు. కరోనా వచ్చి తగ్గుతున్న వారిలో బ్లాక్, వైట్ ఫంగస్లాంటి బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. ఇందుకు అవసరమయ్యే యాంటీఫంగస్ మందులను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని, ఇంకా వైద్య నిపుణులు సూచించిన మందులు, ఇతర వైద్య సేవలను ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరించి అందించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మన ముందున్న మార్గమని అన్నారు. జిల్లాలో లక్షా 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు తెలిపారు.
మూడో దశ అప్రమత్తంగా ఉండండి..
మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని వైద్యులను ఆదేశించారు. వేములవాడ పాత పీహెచ్సీలో 50 పడకలు, సిరిసిల్లలో 50 పడకలతో ప్రత్యేక వార్డును జూన్లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన వారి సేవలను అవసరమైతే తీసుకోవాలని సూచించారు. హోం ఐసొలేషన్లో ఉన్న బాధితుల కోసం వేములవాడలోనూ టెలిసేవలు ప్రారంభించాలని చెప్పారు. ఎంత చేసినా విమర్శించే వారు మాట్లాడుతూనే ఉంటారని, వారిని పట్టించుకోకుండా ప్రజలకు అందించాల్సిన సేవలపైనే దృష్టి పెట్టాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని వైద్యులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, డీఎంహెచ్వో ఆవుల సుమన్మోహన్రావు, సిరిసిల్ల ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్రావు, వేములవాడ వైద్యాధికారి రేగులపాటి మహేశ్రావు, ఎస్పీ రాహుల్హెగ్డే, డీఎస్పీ చంద్రకాంత్, ఆర్డీవో శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, నీలం కల్యాణి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.