రాంనగర్, మే 28: ప్రజల ఆరోగ్య భద్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నదని నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ఆయన సీపీ కమలాసన్రెడ్డితో కలిసి పర్యటించి, లాక్డౌన్ సమయంలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు. వాహన తనిఖీలు కొనసాగుతున్న తీరును పరిశీలించి విధుల్లో ఉన్న పోలీసులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంలో ప్రయాణించి పరిస్థితులను పరిశీలించారు. బస్టాండ్ నుంచి తెలంగాణతల్లి విగ్రహం, కమాన్, హౌసింగ్బోర్డుకాలనీ, కాపువాడ, హుస్సేనీపురా, నాకా చౌరస్తా ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఐజీపీ మాట్లాడుతూ, లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ, పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సడలింపు సమయంలోనే ప్రజలు అవసరం ఉన్న వస్తువులు కొనుగోలు చేసుకోవాలని, అనవసరంగా రోడ్లపైకి రావడం సరికాదన్నారు. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో ప్రధానంగా యువత రోడ్లపైకి వాహనాలతో వస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని, అకారణంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు రెండు వేలకు పైగా వాహనాలను సీజ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.
పోలీసుల చర్యలు అభినందనీయం
లాక్డౌన్లో కరీంనగర్ పోలీసుల సేవలు అభినందనీయమని ఐజీ నాగిరెడ్డి కొనియాడారు. ఇటీవల సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ పోలీసుల పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారని గుర్తు చేశారు. అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు అంకితభావంతో సేవలందిస్తుడడం వల్లే సాధ్యమవుతుందన్నారు. అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, అశోక్, ఏఎస్పీ రితిరాజ్, ఏసీపీలు తుల శ్రీనివాస్రావు, ఆర్ ప్రకాశ్, విజయ్కుమార్, రాములు, మదన్, పోలీసులు పాల్గొన్నారు
ఐసొలేషన్కు ఆకతాయిలు..
లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన ఆకతాయిలను శుక్రవారం కమిషనరేట్ పోలీసులు కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు. కమిషనరేట్ పరిధిలో ఆకతాయిల ఆట కట్టించేందుకు మొబైల్ వాహనాలను రంగంలోకి దించామని, అనవసరంగా రోడ్లపైకి రావద్దని సీపీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు.