కరోనాతో ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి మృతి
తెలంగాణ ఉద్యమం, విద్యా సంస్కరణల్లో కీలక భూమిక
ఆంగ్ల మాధ్యమంతో సర్కారు బడులకు జవసత్వం
విషాదంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సంతాపం
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 28: బతికినంత కాలం వృత్తినే సర్వస్వంగా భావించి.. విద్యా సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి.. తన హోదానే ఇంటిపేరుగా మార్చుకున్న ఎంఈవో రాజయ్య సార్ ఇక లేరు.. కరోనా కాటుకు బలయ్యారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ బుధవారం మరణించారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన రాజయ్య (50), ఉన్నత చదువులు చదివారు. 1995లో టీచర్ ఉద్యోగం సాధించా రు. 2005లో ఎల్లారెడ్డిపేట ఎంఈవోగా నియమితులయ్యారు. నాటి నుంచి ఇక్కడే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అలాగే ముస్తాబాద్ మండల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 23న పాఠశాలల తనిఖీకి వెళ్లిన ఆయన, కొండాపూర్లో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. మూడురోజులు ఇంటివద్దే చికిత్స తీసుకొని, సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించి బుధవారం మరణించారు.
రాజయ్యను కాపాడేందుకు కేటీఆర్ కృషి..
ఈ నెల 23న బారినపడ్డ రాజయ్య అదేరోజూ సిరిసిల్లలోని ఓ దవాఖానలో చేరాడు. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడం తో అధికారులు వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అమాత్యుడు తన సిబ్బందిని పంపించి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో బెడ్ను సిద్ధం చేయించారు. వెంటనే అంబులెన్స్లో దవాఖానకు తరలించి, అడ్మిట్ చేయించారు. అయినా రాజయ్య ప్రాణాలు దక్కకపోవడంతో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమం, విద్యాసంస్కరణల్లో కీలకభూమిక
ఎంఈవో రాజయ్య మంత్రి కేటీఆర్కు ఆప్తుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను చైతన్యపరిచారు. ఊరూరా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పారు. అంతేకాకుండా వృత్తిబాధ్యతల్లోనూ క్రమశిక్షణతో పనిచేసేవారు. ఆయన పనితీరుతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘మనబడి- మనందరి బాధ్యత’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించి పలు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్రం ప్రభుత్వం 2014 నవంబర్లో ఉత్తమ విద్యా పరిపాలన అధికారిగా జాతీయ పురస్కారం అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో నవంబర్ 11న నాటి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ చేతుల మీదుగా ఉత్తమ మండల విద్యాధికారిగా, 2014 జవనరి 26న కరీంనగర్ జిల్లా ఉత్తమ ఎంఈవోగా అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 నవంబరు 29న అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా ఉత్తమ విద్యాపరిపాలన అధికారిగా అవార్డును పొందారు. 2017లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఉత్తమ పరిపాలానాధికారిగా అవార్డును అందుకున్నారు.
గొప్ప విద్యావేత్తను కోల్పోయాం..
ఎంఈవో రాజయ్య మృతికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సంతాపం ప్రకటించారు. గొప్ప విద్యావేత్తను కోల్పోయామని, ఆయన మరణం తనను ఎంతో బాధించిందని కేటీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఉద్యమకాలం నుంచి ఆయనతో తనకు అనుబంధం ఉన్నదన్నారు. తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అలాగే, సిరిసిల్ల డీఈవో రాధాకిషన్, ఎంఈవో రఘుపతి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్రావు సంతాపం తెలిపారు.