స్వరాష్ట్రంలో దివ్యాంగులకు పెద్దపీట
బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయిస్తున్నం
రూ.3,116 పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే లేదు
సహకారం అందిస్తున్న సర్కారుకు మద్దతివ్వాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో 386 మంది దివ్యాంగులకు వందశాతం సబ్సిడీతో ఉపకరణాల పంపిణీ
జమ్మికుంట, సెప్టెంబర్ 27 : “దివ్యాంగులు దేవుడిచ్చిన బిడ్డలు. కల్లాకపటం తెలియని వాళ్లు. అలాంటి వారు పుడితే తల్లిదండ్రులు అవస్థలు పడిన సందర్భాలెన్నో. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నడు. మనసున్న మారాజు.. దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.3116 పింఛనిస్తున్నడు. ఉపకరణాలు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా అందిస్తున్నడు. ప్రభుత్వం బడ్జెట్లో రూ.70కోట్లు కేటాయిస్తున్నది. అన్ని రంగాల్లో రాణించేందుకు 3 శాతం ఉన్న రిజర్వేషన్ను 5 శాతం పెంచింది. ఇంత సహకారం అందిస్తున్న సర్కారుకు మద్దతివ్వండి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించండి.” అంటూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 386 మంది దివ్యాంగులకు రూ.98 లక్షల 36 వేల 400 విలువైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించగా, మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇందులో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ 20, బ్యాటరీ ట్రైసైకిళ్లు 170, ల్యాప్టాప్స్ 3, 4జీ స్మార్ట్ ఫోన్లు 9, బ్యాటరీ వీల్చైర్లు 4, హియరింగ్స్ 73, వీల్ చైర్స్ 41, బ్లైండ్ స్టిక్స్ 36, ట్రైసైకిళ్లు 24 ఉండగా, వీటిని మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో సదరమ్ క్యాంపులు నిర్వహించామని, అందులో అర్హులకు నెలలోపే ఉపకరణాలు, పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. గత జూలైలో హుజూరాబాద్లో 658 మందికి, ఇప్పుడు 386 మందికి ఉపకరణాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. 2020-21 సంవత్సరానికి ఆైన్లెన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్, మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు ఇంటి నుంచే చేసుకునేలా ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రతి అర్హుడికీ పింఛన్, ఉపకరణాలు వస్తాయన్నారు. సదరమ్ క్యాంపుల్లో అనర్హులు ఎంపికవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, ఇప్పటి నుంచి ఎంపీడీవో ధ్రువీకరిస్తేనే అర్హులుగా పరిగణిస్తామని చెప్పారు. ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రవీందర్, జగిత్యాల అధికారి నరేశ్, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ తిరుమల, నాయకులు రాజిరెడ్డి, రవి, శ్రీనివాస్, రవీందర్రెడ్డి, మల్లయ్య, విజయలక్ష్మి, పూలమ్మ, రాజ్కుమార్, సమ్మిరెడ్డి, కోటి పాల్గొన్నారు.
సీఎం సహృదయులు
దివ్యాంగుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది. సీఎం మంచి చేయాలని నిర్దేశిస్తున్నరు. దివ్యాంగుల కోసం పథకాలు పెంచారు. బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తున్నరు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నరు. స్కాలర్షిప్ నుంచి పింఛన్, ఉపకరణాల వరకు ఆన్లైన్ చేశారు. సీఎం గొప్ప సహృదయులు. ఎక్కడాలేని విధంగా ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నరు. 3 నుంచి 5 శాతం రిజర్వేషన్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.20 కోట్లకు పైగా విలువైన పరికరాలు పంపిణీ చేసినం. పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి.
దివ్యాంగులపై ప్రత్యేక చొరవ
దివ్యాంగులపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. రెండు నెలల కిందట హుజూరాబాద్లో 700 మంది వరకు దివ్యాంగులకు ఉపకరణాలు అందించినం. ఇప్పుడు మరో 386 ఇస్తున్నం. ఇవి దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడ్తయ్. జిల్లాలో 20 వేల మంది దివ్యాంగులకు పింఛన్లు వస్తున్నయ్. నెలకు రూ.6 కోట్ల 8 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. రూ.3 వేల పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా లేదు. తెలంగాణలోనే సాధ్యమైతంది. సాంకేతిక ఉపకరణాలు దివ్యాంగులకు తోడుగా ఉంటయ్.