కొత్తపల్లి, సెప్టెంబర్ 27: భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావాలను సజీవంగా ఉంచడానికి యోగా ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇండియన్ యోగా ఫెడరేషన్, తెలంగాణ యోగా అసోసియేషన్లు సంయుక్తంగా ఆదివారం ఆన్లైన్లో నిర్వహించిన ఐదో జాతీయ రెఫరీస్ రిఫ్రెషర్ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతాలకు అతీతంగా మానవాళి శ్రేయస్సుకు దోహదపడే యోగా శరీరాన్ని, మనస్సును నియంత్రించి చెడును నివారిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడంలో ప్రధాని మోదీ కీలకపాత్ర పోషించారన్నారు. కరోనా సమయంలో అన్ని దేశాల్లో యోగా సాధన చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా యోగా విస్తరణ కోసం యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఆసియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. 47 సంవత్సరాలుగా దేశంలో యోగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి కరోనా సమయంలో రెండుసార్లు జాతీయస్థాయి యోగా పోటీలను ఆన్లైన్లో నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నుంచి నిఖిత చేసిన యోగాసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అండమాన్, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి రిఫరీలు రిఫ్రీస్ ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇండియన్ యోగా ఫెడరేషన్ ఇందు అగర్వాల్, తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్యాదవ్, జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి, తెలంగాణ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మనోహర్కుమార్జాలా, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్.సిద్దారెడ్డి, భరత్భూషణ్ పాల్గొనగా ఇండియన్ యోగా ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ యశ్ పరాషర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.