బోయినపల్లి/జ్యోతినగర్, సెప్టెంబర్ 27: ఆదివారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. గోదావరి, మానేరు, మోయతుమ్మెద ఉధృతంగా ప్రవహిస్తున్నవి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండ లం మాన్వాడలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వరదలు, ఎస్సారెస్పీ ఫ్లడ్ కెనాల్ నుంచి 22,115 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అధికారులు 18గేట్లు ఎత్తారు. 65,172క్యూసెక్కులు కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ)కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 24.472 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ఇక కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీకి మోయతుమ్మెద, మిడ్ మానేరు, ఇతర క్యాచ్మెంట్ ఏరియాల నుంచి 89,280 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 18 గేట్లు ఎత్తి 97,434 క్యూసెకులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 24.034 టీఎంసీలకు గాను 23.558 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎల్లంపల్లికి 3.12లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
గోదావరికి వరద పోటెత్తుతుండగా, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.12లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు 36గేట్లు ఎత్తి 3.66లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్లో 20.175 టీఎంసీలకు గాను 18.11 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
సింగసముద్రం సవ్వడులు
గంభీరావుపేట, సెప్టెంబర్ 27: నర్మాల ఎగువ మా నేరు ప్రాజెక్టుతోపాటు సింగ సముద్రం చెరువు మత్తడి దుంకుతున్నాయి. లింగన్నపేట వాగు, మానేరు వాగు రోడ్డాంల వద్ద దాటేందుకు వాహనదారులు ఎవరు ప్రయత్నం చేయవద్దని ఎస్ఐ సౌమ్యారెడ్డి కోరారు.