5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్ కమిషనర్ క్రాంతి
కార్పొరేషన్, మే 27: నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 31లోగా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి, 5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ క్రాంతి కోరారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ట్రేడ్ లైసెన్సులు, నల్లా పన్నులు కూడా చెల్లించాలన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండో విడుత ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించి సరైన సమాచారం అందించాలన్నారు. అలాగే, ప్రభుత్వం రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించిందని, నగరంలోని అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి సూపర్ స్పైడర్లకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్ష చేసుకోవాలని సూచించారు.
అనుమతి ఉంటేనే ఫంక్షన్హాళ్లు ఇవ్వాలి
కార్పొరేషన్, మే 27: నగరంలోని ఫంక్షన్ హాళ్ల యజమానులు వీలైనంత వరకు శుభకార్యాలను నిరాకరించాలని, ప్రభుత్వ అనుమతి ఉంటేనే అద్దెకు ఇవ్వాలని కమిషనర్ క్రాంతి ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఫంక్షన్ హాళ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, శుభకార్యాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు 40 మందిని మాత్రమే అనుమతించాలన్నారు. ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. మండపాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. శుభకార్యాలకు వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, ఫంక్షన్ హాళ్ల యజమానులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన
నగరంలో కొత్తగా మూడు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ క్రాంతి తెలిపారు. నగరంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ఎస్ఆర్ఆర్, ప్రభుత్వ బాలికల జూనియర్, ఉమెన్స్ డిగ్రీ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో సూపర్ స్పైడర్లకు శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో జువేరియా, సివిల్ సైప్లె డీడీ శ్రీకాంత్రెడ్డి, కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్, కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.